ధర్నా చౌక్ వద్ద హరితహారం రద్దు
ABN , First Publish Date - 2023-06-20T00:53:47+05:30 IST
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ధర్నా చౌక్ వద్ద హరితహారం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు సోమవారం రద్దుచేశారు.
భువనగిరి అర్బన్, జూన్19: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ధర్నా చౌక్ వద్ద హరితహారం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు సోమవారం రద్దుచేశారు. ధర్నా చౌక్ వద్ద నిరసన తెలుపకుండా నిలువరించేందుకే ఈ ప్రాంతంలో హరితహారం కింద మొక్కలు నాటేందుకు అధికారులు పూనుకున్నారని వామపక్షాలతోపాటు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ డి.శ్రీనివా్సరెడ్డి, భువనగిరి మునిసిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. దీంతో స్పందించిన అదనపు కలెక్టర్ నిరసనకారులతో మాట్లాడి కలెక్టరేట్ ప్రహరి పొడవునా మొక్కలు నాటి ధర్నా చౌక్ ప్రాంతాన్ని ఖాళీగా వదిలారు. కాగా, ఇది శాశ్వతమా లేక తాత్కాలికంగా నిలిపివేశారా? అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిరసన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏశాల అశోక్, న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి సహదేవ్, బండి జంగమ్మ, కొండమడుగు నర్సింహ, బట్టు అనురాధ, చెక్కా వెంకటేశ్, దాసరి పాండు, గడ్డం వెంకటేశ్, పుట్ట రమేష్, జూకంటి పౌల్, వడ్డెబోయిన వెంకటేశ్, సత్యనారాయణ పాల్గొన్నారు.