Nowhera Shaik: నౌహీరా షేక్ ఆస్తులను అటాచ్‌ చేసిన ఈడీ

ABN , First Publish Date - 2023-03-25T17:32:05+05:30 IST

స్కీముల పేరుతో స్కాములకు పాల్పడ్డ హీరా గోల్డ్‌ సంస్థల అధినేత్రి నౌహీరా షేక్‌ (Nowhera Shaik) కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Nowhera Shaik: నౌహీరా షేక్ ఆస్తులను అటాచ్‌ చేసిన ఈడీ

హైదరాబాద్‌: స్కీముల పేరుతో స్కాములకు పాల్పడ్డ హీరా గోల్డ్‌ సంస్థల అధినేత్రి నౌహీరా షేక్‌ (Nowhera Shaik) కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నౌహీరా షేక్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అటాచ్‌ చేసింది. నౌహీరా రూ.33 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేశారు. హీరాగోల్డ్‌ (Heeragold), నౌహీరా షేక్ ఆస్తులు అటాచ్‌ చేస్తూ ఈడీ ఆదేశాలిచ్చింది. గతంలోనే రూ.367 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. కంపెనీ రూల్స్ ఉల్లంఘించి మోసాలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. తమ సంస్థల్లో పెట్టుబడులు పెడితే ఏడాదికి 36శాతం అధిక మొత్తం చెల్లిస్తాంటూ నౌహీరా షేక్‌ దేశవ్యాప్తంగా వేల మందికి రూ. 5 వేల కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన విషయం తెలిసిందే.

ఆమె ఈ నిధులను షెల్‌ కంపెనీల ద్వారా మళ్లించినట్లు ఈడీ ఇప్పటికే 2018లో గుర్తించి, మనీలాండరింగ్‌ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఎస్‌ఏ బిల్డర్‌ అండ్‌ డెవలపర్స్‌ ద్వారా టోలిచౌకి (Tolichowki)లో ఆస్తులు కొనుగోలు చేసేందుకు రూ.148 కోట్లు దారిమళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఈ ఆస్తుల విలువ సుమారు రూ. 70 కోట్లు మాత్రమే ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. మిగతా మొత్తంలో రూ.41 కోట్లను కోల్‌కతా (Kolkata), షిల్లాంగ్‌లోని నీలాంచల్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌తోపాటు మరికొన్ని షెల్‌ కంపెనీలకు దారిమళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఆ నిధులను ఆయా సంస్థల నుంచి సల్లార్‌పురియా సంస్థ రుణాల పేరుతో తిరిగి తీసుకున్నట్లు దర్యాప్తులో ఆధారాలను సేకరించారు. ఆ సంస్థకు చెందిన రూ. 41.05 కోట్ల విలువైన స్థిరాస్తులు, బ్యాంకు బ్యాలెన్స్‌లను అటాచ్‌ చేసినట్లు గతంలో ఈడీ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం రూ.400 కోట్లకు నౌహీరా షేక్ ఆస్తుల అటాచ్ చేరింది.

Updated Date - 2023-03-25T17:32:05+05:30 IST