CM KCR: మళ్ళీ గెలిస్తే పటాన్‌చెరు వరకు మెట్రో ఇస్తాం

ABN , First Publish Date - 2023-06-22T15:22:34+05:30 IST

వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ గెలిస్తే పటాన్‌చెరు వరకు మెట్రో ఇస్తామని... మొదటి కేబినేట్ మీటింగ్‌లోనే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. గురువారం పటాన్‌చెరులో 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు సీఎం భూమి పూజ చేశారు. సభా వేదికపై ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్ నివాళులర్పించారు.

CM KCR: మళ్ళీ గెలిస్తే పటాన్‌చెరు వరకు మెట్రో ఇస్తాం

సంగారెడ్డి: వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ (BRS) మళ్లీ గెలిస్తే పటాన్‌చెరు వరకు మెట్రో ఇస్తామని... మొదటి కేబినేట్ మీటింగ్‌లోనే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. గురువారం పటాన్‌చెరులో 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు సీఎం భూమి పూజ చేశారు. సభా వేదికపై ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... రాష్టం ఏర్పడ్డప్పుడు ఎన్నో అపోహలు సృష్టించారని అన్నారు. 24 గంటలు కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకొచ్చారు. ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చే ఏకైక రాష్టం తెలంగాణ అని అన్నారు. పటాన్‌చెరు నుంచి హయత్‌నగర్ అత్యధిక ట్రాఫిక్ ఉండే ప్రాంతమని.. మళ్ళీ గెలిస్తే పటాన్ చెరు వరకు మెట్రో ఇస్తామని చెప్పారు. ఒకప్పుడు అక్కడ ఎకరా అమ్మితే ఇక్కడ 10 ఎకరాలు కొనుక్కోవచ్చని చంద్రబాబు చెప్పారని.. కానీ ఇప్పుడు పరిస్థితి తారు మారు అయ్యిందని ఆయనే అన్నారని తెలిపారు. ఆ విధంగా తెలంగాణ అభివృద్ధి చెందిందని సీఎం అన్నారు.

తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కడుతున్న డబుల్ బెడ్ రూమ్‌లు దేశంలో ఎక్కడా లేవన్నారు. మోసపోతే మనం గోసపడతమని తెలిపారు. హరీశ్‌రావు వచ్చాక వైద్య రంగం పరుగులు పెడుతోందని అన్నారు. హైదరాబాద్‌లో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ తప్ప వేరే ఆస్పత్రులు లేవని.. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి మళ్ళీ ఉండాలంటే మళ్ళీ మనమే రావాలని చెప్పుకొచ్చారు. మరోసారి మహిపాల్ రెడ్డిని దీవించాలని కోరారు. తాము చెప్పింది చేస్తామని.. మాట తప్పమని స్పష్టం చేశారు. మూడు మున్సిపాలిటీలకు రూ.30 కోట్ల చొప్పున ఇస్తామన్నారు. రూ.55 గ్రామ పంచాయితీలకు రూ.15 లక్షలు నిధులు ఇస్తామని, మూడు జీహెచ్‌ఎంసీ డివిజన్లకు రూ.10 కోట్ల చొప్పున నిధులు ఇస్తామన్నారు. పటాన్‌చెరును త్వరలో రెవెన్యూ డివిజన్ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, సంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-22T16:23:44+05:30 IST