Vegetables: తగ్గిన కూరగాయల ధరలు.. రూ.20లోపు టమాట, వంకాయ
ABN , First Publish Date - 2023-12-06T08:13:27+05:30 IST
కూరగాయల ధరలు అందుబాటులోకి వచ్చాయి. వారం రోజుల క్రితం వరకు ఉన్న ధరలు రెండురోజులుగా తగ్గుముఖం
- కొత్త పంట రాకతో అందుబాటులోకి..
- దిగిరాని ఉల్లిగడ్డ, మునగకాయ రేట్లు
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): కూరగాయల ధరలు అందుబాటులోకి వచ్చాయి. వారం రోజుల క్రితం వరకు ఉన్న ధరలు రెండురోజులుగా తగ్గుముఖం పట్టాయి. అక్టోబర్ వరకు కురిసిన వర్షాలతోపాటు కొత్త పంట ఆలస్యం కారణంగా గతంలో ఒక్కో రకం కూరగాయలకు కిలో రూ.50 వరకు ధర పలికింది. కొత్తిమీర, పుదీన, పాలకూర, తోటకూరల రేట్లు సైతం ఎక్కువగానే పలికాయి. ప్రస్తుతం కొత్తపంట చేతికి రావడంతో నాలుగు రోజుల నుంచి రైతుబజార్లలో కూరగాయల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. వారం క్రితం వరకు టమాట కిలో రూ.30 వరకు పలుకగా.. ప్రస్తుతం రూ.15కే లభిస్తోంది. బయటి దుకాణాల్లో మాత్రం రూ.25 నుంచి రూ.30 వరకు విక్రయిస్తున్నారు. ఉల్లిగడ్డ, మునగకాయ రేట్లు సామాన్యులను కలవరపెడుతున్నాయి. రైతుబజార్లో ఉల్లి కిలో రూ.44, మునక్కాడ కిలో రూ.65అమ్ముతుండగా.. బహిరంగ మార్కెట్లో రూ.10-15 పెంచి విక్రయిస్తున్నారు. దీంతో కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. డిసెంబర్ చివరి వారం వరకు ధరలు సాధారణ స్థాయిలోనే ఉంటాయని, తర్వాత నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు.