వరంగల్‌ పశ్చిమ నుంచే పోటీచేస్తా..

ABN , First Publish Date - 2023-03-22T00:16:03+05:30 IST

‘రానున్న ఎన్నికల్లో వరంగల్‌ పశ్చిమ నియోజక వర్గం నుంచే పోటీ చేస్తా.. నేను 30 ఏళ్లుగా కాంగ్రెస్‌ జెండా మోస్తున్నా, ప్రస్తుత హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌ రెడ్డి స్థానికుడు కాదు... టిక్కెట్‌ నాకే వస్తుంది.. అనుమానం ఏమీ లేదు..’ అని డీసీసీబీ మాజీ చైర్మన్‌, కాంగ్రెస్‌ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అన్నారు. ‘నాయిని దూరపోడేమి కాదు, నా గెలుపునకు నాయిని రాజేందర్‌ రెడ్డి రెండు, మూడు కోట్లు ఖర్చు పెట్టి మరీ గెలిపిస్తాడు’ అన్నాడు.

వరంగల్‌ పశ్చిమ నుంచే పోటీచేస్తా..
మాట్లాడుతున్న జంగా రాఘవరెడ్డి

కబ్జాలు చేయడంలో దిట్ట వినయభాస్కర్‌

ఈ సారి ఆయన ఓడిపోతాడు..

డీసీసీబీ మాజీ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి

.కాజీపేట, మార్చి 21: ‘రానున్న ఎన్నికల్లో వరంగల్‌ పశ్చిమ నియోజక వర్గం నుంచే పోటీ చేస్తా.. నేను 30 ఏళ్లుగా కాంగ్రెస్‌ జెండా మోస్తున్నా, ప్రస్తుత హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌ రెడ్డి స్థానికుడు కాదు... టిక్కెట్‌ నాకే వస్తుంది.. అనుమానం ఏమీ లేదు..’ అని డీసీసీబీ మాజీ చైర్మన్‌, కాంగ్రెస్‌ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అన్నారు. ‘నాయిని దూరపోడేమి కాదు, నా గెలుపునకు నాయిని రాజేందర్‌ రెడ్డి రెండు, మూడు కోట్లు ఖర్చు పెట్టి మరీ గెలిపిస్తాడు’ అన్నాడు.

కాజీపేట 63వ డివిజన్‌లో మంగళవారం హాత్‌సే హాత్‌ జోడో యాత్ర జరిగింది. మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు అనంతరం ఈ యాత్ర విష్ణుపురి, కూరగాయాల మార్కెట్‌, జూబ్లీమార్కెట్‌ మీదుగా అంబేద్కర్‌ నగర్‌కు చేరుకుంది. కాలనీలలో జంగా స్థానికులను కలుస్తూ రాహుల్‌ సందేశం కరపత్రాలు పంపిణీ చేస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంబేద్కర్‌ నగర్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

బీఆర్‌ఎస్‌, బీజేపీ కులాల మధ్య చిచ్చుపెట్టి వర్గాలుగా విడదీసి రాజకీయంగా లబ్ధిపొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ వేరుకాదు వీరిద్దరూ తోడుదొంగలే అన్నారు. రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ సాధన పై ఆ రెండు పార్టీలకు చిత్తశుద్ధిలేదన్నారు. కోచ్‌ఫ్యాక్టరీ వస్తే వేలాది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేవన్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ కబ్జాలు చేయడంలో దిట్ట అన్నారు. గతంలో నీ ఆస్తులెన్ని, ఇప్పుడు నీ ఆస్తులెన్నీ లెక్కతీయాలన్నారు. వినయ్‌భాస్కర్‌ కాజీపేటకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. కాజీపేట బస్టాండ్‌, జూనియన్‌ కళాశాల, పార్క్‌, అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ ఏమయ్యాయని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో వినయ్‌భాస్కర్‌ను చిత్తుచిత్తుగా ఓడిస్తారని జోస్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు కట్ల శ్రీనివాస్‌, 63వ డివిజన్‌ కార్పొరేటర్‌ విజయశ్రీరజాలీ, 62వ డివిజన్‌ కార్పొరేటర్‌ జక్కుల రవీందర్‌ యాదవ్‌, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేపల్లె రంగనాథ్‌, మాజీ కార్పొరేటర్‌ తొట్ల రాజుయాదవ్‌, నాయకులు గుర్రపు కోటేశ్వర్‌, బోయిని కుమార్‌ యాదవ్‌, సందెల విజయ్‌, మండల సమ్మయ్య, వస్కుల శంకర్‌, బైరి వరలక్ష్మి, దోమ మహేందర్‌ రెడ్డి, అనిత రెడ్డి, మద్దెల శోభతోపాటు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Updated Date - 2023-03-22T00:16:03+05:30 IST