నేటి నుంచి కొమ్మాల జాతర
ABN , First Publish Date - 2023-03-07T00:06:13+05:30 IST
నేటి నుంచి కొమ్మాల జాతర
గీసుగొండ, మార్చి 6: కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన కొమ్మాల శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతర నేటి నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. జాతరకు వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో శేషగిరి, ఉత్సవ కమిటీ చైర్మన్ కుమారస్వామి తెలిపారు. ఎంతో విశిష్టతగల కొమ్మాల జాతర అనగానే నాటి రాజకీయాలు కళ్లముందు కదులాడుతాయి. జాతరలో ఎరుపెక్కే రాజకీయ ప్రభలు, మంది మార్బాలాలతో నాయకుల దర్పణం, పోటీపడి ఎత్తులో నిర్మించే ప్రభల దర్శనమిస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ ప్రభలను పోలీసులు నిషేధించగా ఈ సంతవ్సరం మాత్రం నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చారు. దీంతో రాజకీయ ప్రభల జోరు కొనసాగనుంది. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకునేలా అన్ని ఏర్పాట్లను చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం హోలి వేడుకల్లో మునిగి తేలి సాయంత్రం జాతరకు ఎడ్లబండ్లపై భక్తులు తరలిరావడం ఆనవాయితీగా వస్తోంది. వరంగల్ మహానగరం నుంచి కూడా ఎడ్లబండ్లపై పెద్దసంఖ్యతో తరలివస్తారు. దీంతో వరంగల్ -నర్సంపేట రోడ్డులో బారులు తీరే ఎడ్లబండ్ల సవ్వడులు ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తాయి. రంగులహోలి, నిండు పౌర్ణమి రోజు ఆలయం చుట్టు గోవిందా నామస్మరణలతో ఎడ్ల బండ్లపై ఒంటె, గుర్రం, మేక, ఏనుగు వంటి భక్తి ప్రభలతో భక్తిపారవశ్యంతో భక్తుల చేసే కోలాహలం ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది.
తగ్గిన వేలం పాటల ఆదాయం
జాతరలో వేలం పాటల ద్వారా వచ్చే ఆదాయం ప్రతి యేట పెరుగుతుండగా ఈ సంవత్సరం తగ్గటం గమనార్హం. గత సంవత్సరం కొబ్బరికాయల వేలం పాట రూ. 6లక్షలకు మించి పోగా ఈ సంవత్సరం రూ.4 లక్షలే వచ్చింది. కొమ్మాల గ్రామపంచాయతీ ఆధీనంలో నిర్వహించే సైకిల్ స్టాండ్ వేలం పాటకు గత సంవత్సరం రూ.4 లక్షల వరకు వచ్చింది. ఈసారీ రు. 2 లక్షలకు మించక పోవటంతో రద్దు చేసి, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ కుమారస్వామి తెలిపారు. వాహన స్టాండ్లో ద్విచక్రవాహనాలకు రూ.20, ఆటోలకు రూ.30, ఫోర్వీలర్లకు రూ.50 చొప్పున రుసుంను నిర్ణయించినట్లు చెప్పారు.