అరటి పంటకు నిప్పు
ABN , Publish Date - Mar 04 , 2024 | 12:10 AM
ఆరుకాలం శ్రమించి తీరా చేతికొచ్చే సమయంలో పంటఅగ్నికి ఆహుతై పోతుంటే చూసి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ రైతు ఆవేదన అంతా ఇంతా కాదు.
రొళ్ల, మార్చి 3: ఆరుకాలం శ్రమించి తీరా చేతికొచ్చే సమయంలో పంటఅగ్నికి ఆహుతై పోతుంటే చూసి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ రైతు ఆవేదన అంతా ఇంతా కాదు. రొళ్ల మండలం ఎం రాయాపురానికి చెందిన రైతు నాగేంద్రప్ప తన మూడు ఎకరాల పొలంలో అరటి పంట సాగు చేశాడు. ప్రస్తుతం కోత దశలో ఉంది. అయితే ఆ అరటి పంటకు శుక్రవారం రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన నిప్పుకు మొత్తం చెట్లతోపాటు డ్రిప్ పరికరాలు, చేతికొచ్చిన పంట పూర్తిగా కాలిపోయిందని ఆ రైతు కన్నీరుమున్నీరుగా ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంట నోటికి అందకుండా కాలిపోయిందని, తనను ఆదుకొనే నాథుడు ఎవరు అని ఆ రైతు వేదన చూపరులను కంటతడి పెట్టించింది. మొక్క స్థాయి నుంచి పంట స్థాయి వరకు వాటికి నీరు, మందులు, కూలీలు, డ్రిప్ సౌకర్యం తదితర వాటికి దా దాపు రూ.8లక్షలు ఖర్చు పెట్టానని, ఇప్పుడు పూర్తిగా నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని ఆయన కోరాడు.