FARMER: ఖాతాలో జమకాని పంటనష్ట పరిహారం..!
ABN , Publish Date - May 20 , 2024 | 11:48 PM
రైతుల ఖాతాల్లో నేటికీ కొందరు రైతుల ఖాతాల్లో పంటనష్టపరిహారం జమ కాలేదు. ఓ వైపు ఈ ఖరీఫ్లో ముందస్తు వర్షాలు కురుస్తున్నాయి. చేతిలో చిల్లిగవ్వ లేక పంట సాగుకు పొలాలను సిద్ధం చేసుకోలేకపోతున్నామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది దెబ్బతిన్న పంటలకు పంట నష్టపరిహారం అందిస్తామని ప్రభుత్వం చెప్పినా ఖరీఫ్ సీజన ప్రారంభమవుతున్నా రైతుల ఖాతాలలోకి పంటనష్ట పరిహారం కొంత మందికి జమ అవుతున్నా, మరికొంత మందికి జమ కావడం లేదు.
పరిహారం కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ
చేతిలో చిల్లిగవ్వ లేదు... పంటల సాగు ఎలా?
ఆవేదనలో అన్నదాతలు..
మడకశిర, మే 20: రైతుల ఖాతాల్లో నేటికీ కొందరు రైతుల ఖాతాల్లో పంటనష్టపరిహారం జమ కాలేదు. ఓ వైపు ఈ ఖరీఫ్లో ముందస్తు వర్షాలు కురుస్తున్నాయి. చేతిలో చిల్లిగవ్వ లేక పంట సాగుకు పొలాలను సిద్ధం చేసుకోలేకపోతున్నామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది దెబ్బతిన్న పంటలకు పంట నష్టపరిహారం అందిస్తామని ప్రభుత్వం చెప్పినా ఖరీఫ్ సీజన ప్రారంభమవుతున్నా రైతుల ఖాతాలలోకి పంటనష్ట పరిహారం కొంత మందికి జమ అవుతున్నా, మరికొంత మందికి జమ కావడం లేదు. దీంతో పంటనష్ట పరిహారం జమ కాని రైతులు బ్యాంకులు, అధికారుల చుట్టు తిరుగుతున్నారు. గత సంవత్సరం అధిక వడ్డీకి అప్పులు తెచ్చి పంటలు సాగుచేశారు. తీవ్ర వర్షాభావంతో పంటలు దెబ్బతిని పూర్తిగా నష్టపోయి అప్పులపాలు అయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో తిరిగి పంటలు సాగు చేసేందకు అప్పులు పుట్టడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ప్రతి ఏడాదీ రైతులు ఖరీఫ్లో 40 వేల హెక్టార్లు దాకా పంటలు సాగు చేస్తున్నారు. వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని ప్రతి ఏడాదీ నష్టపోతూనే ఉన్నారు. మరో పక్క పంటల సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోతోంది. ఎకరా వేరుశనగ సాగు చేయాలంటే రూ.20వేల నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంది. ప్రతి ఏడాది ఏదో విధంగా పంటలు దెబ్బతినడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
బటన నొక్కినా జమకాని సొమ్ము
గత ఏడాది ఖరీఫ్లో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు ఇనపుట్ సబ్సిడీ ఇస్తామని సీఎం జగనమోహనరెడ్డి మార్చి 6న బటన నొక్కాడు. అయితే ఈ నిధులను పోలింగ్ పూర్తయిన వెంటనే వారి ఖతాలలోకి జమ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికలు ముగిసి 7 రోజలు అవుతున్నా నేటికి కొంతమంది రైతుల ఖతాల్లోకి పంటనష్ట పరిహారం జమకాలేదు. దీంతో రైతులు బ్యాంకులు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మడకశిర నియోజకవర్గంలోని ఐదుమండలాల్లో గత ఖరీఫ్లో 19,695 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 47,505 మంది రైతులకు రూ.28.62 కోట్ల పంటనష్ట పరిహారం మంజూరైంది.
ఇనపుట్ సబ్సిడీ జమ కాలేదు..
తనకు 3.5 ఎకరాల పోలం ఉంది. ప్రతి ఏడు అప్పులు చేసి వేరుశనగ పంట సాగు చేశా. అతివృష్టి అనావృష్టి కారణంగా పంటలు దెబ్బతిని పూర్తిగా నష్టపోతున్నాం. వర్షాభావం కారణంగా వేరుశనగ పంట దెబ్బతిని నష్ట పోయాం. ప్రభుత్వం ఇనపుట్ సబ్సిడీ మంజూరు చేసింది. అయితే నేటికీ ఖాతాలోకి నగదు జమ కాలేదు. వేలాది రూపాయాలు పంట సాగుకు పెట్టుబడి పెట్టి నష్టపోయా. కనీసం గ్రాసం కూడా దక్కలేదు. ప్రభుత్వం స్పందించి పంటనష్ట పరిహారం అందించాలి.
- శాంతకుమార్, ముక్కడంపల్లి, అగళి మండలం
కౌలుకు పంట సాగు చేశా
సొంత భూమి లేక కౌలుకు తీసుకుని వేరుశనగ పంటను సాగు చేశా. రెండు ఎకారలకు రూ.40 వేల దాకా ఖర్చు చేశా. తీవ్ర వర్షాభావంతో ఆ పంట కాస్త ఎండిపోయింది. పంటను మధ్యలోనే తొలగించా. పెట్టుబడి మొత్తం పోయింది. పంట నష్ట పరిహారం నేటికీ అందలేదు. ఈ ఏడు పెట్టుబడికి చేతిలో చిల్లిగవ్వ లేక వేరుశనగకు బదులు ఉలువులు వేస్తున్నా.\
- రైతు అస్లామ్బాషా