FIRE ACCIDENT: ట్రాన్సపోర్ట్ వాహనంలో మంటలు
ABN , Publish Date - May 29 , 2024 | 11:39 PM
మండలంలోని ఎగువపల్లి సమీపాన 44వ జాతీయ రహదారిపై బుధవారం నవత ట్రాన్సపోర్ట్ వాహనంలో మంటలు చెలరేగాయి. స్థానికులు తెలిపిన మేరకు.. నవత ట్రాన్సపోర్ట్ వాహనం బియ్యం, ఫర్నీచర్, చీరలు, దస్తులు తదితరాల లోడుతో హైదారాబాద్ నుంచి బెంగళూరుకు వెళుతోంది.
గార్లదిన్నె, మే 29: మండలంలోని ఎగువపల్లి సమీపాన 44వ జాతీయ రహదారిపై బుధవారం నవత ట్రాన్సపోర్ట్ వాహనంలో మంటలు చెలరేగాయి. స్థానికులు తెలిపిన మేరకు.. నవత ట్రాన్సపోర్ట్ వాహనం బియ్యం, ఫర్నీచర్, చీరలు, దస్తులు తదితరాల లోడుతో హైదారాబాద్ నుంచి బెంగళూరుకు వెళుతోంది. గార్లదిన్నె మండలం కల్లూరు ఎగువపల్లి సమీపంలోకి రాగానే వాహనం నుంచి మంటలు వ్యాపించాయి. విషయాన్ని రహదారిపై వెళుతున్న వారు గుర్తించి డ్రైవర్కు తెలిపారు. డ్రైవర్ గుర్రాల సుమన వెంటనే వాహనాన్ని రోడ్డుపై నిలిపి మంటలను గమనించాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ మహమ్మద్గౌస్ బాషా సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
వాహనంలో వస్తున్న మంటలను ఆదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఆగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సిబ్బంది హుటాహుటిన చేరుకుని వాహనంలో మంటలను అదుపు చేశారు. రహదారిపై ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా ఎస్ఐ ముందస్తు చర్యలు చేపట్టారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వాహనంలో ఎంత సరుకు ఉంది, ఎంత నష్టం జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది.