అంగనవాడీలపై ప్రభుత్వం కక్షపూరిత వైఖరి
ABN , Publish Date - Jan 06 , 2024 | 12:31 AM
ధర్మవరం, జనవరి 4: అంగనవాడీల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఏపీరైతుసంఘం జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న మండిపడ్డారు.
ధర్మవరం, జనవరి 4: అంగనవాడీల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఏపీరైతుసంఘం జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న మండిపడ్డారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పట్టణంలోని అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 25వ రోజుకు చేరింది. వారు ఒంటి కాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లిపెద్దన్న, సీఐటీయూ మండల అఽధ్యక్షుడు ఆదినారాయణ సంఘీబావం తెలిపారు. జంగాలపల్లి పెద్దన్న మాట్లాడుతూ..25 రోజులుగా అంగనవాడీలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. పైపెచ్చు వారిపై కక్షసాధింపుచర్యలకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగనవాడీవర్కర్లు సరస్వతి, చంద్రకళ, పోతక్క, దీనా, గోవిందమ్మ, మాంచాలనిదేవి, అనిత, కృష్ణవేణి, భువనేశ్వరి, లలిత పాల్గొన్నారు.