GURUPOURNAMI: అంబరాన్నంటిన గురుపౌర్ణమి సంబరాలు
ABN , Publish Date - Jul 21 , 2024 | 11:49 PM
గురువులకు గురువైన సాయినాథుడిని స్మరించుకుంటూ ఆదివారం జిల్లావ్యాప్తంగా గురుపౌర్ణమి సంబరాలు అంబరాన్నంటాయి. ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తడంతోపాటు సాయినామస్మరణతో భక్తిపారవశ్యం పొందారు.
మార్మోగిన సాయినామం
అనంతపురం కల్చరల్, జూలై 21: గురువులకు గురువైన సాయినాథుడిని స్మరించుకుంటూ ఆదివారం జిల్లావ్యాప్తంగా గురుపౌర్ణమి సంబరాలు అంబరాన్నంటాయి. ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తడంతోపాటు సాయినామస్మరణతో భక్తిపారవశ్యం పొందారు. జిల్లాకేంద్రంలోని సాయిమందిరాలవద్ద స్వామివారి దర్శనంకోసం భక్తులు బారులుతీరారు. పంచామృతాభిషేకాలు, రుద్రాభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, కాగడహారతులు, పల్లకీసేవలతో భక్తులు తరించిపోయారు. మూడవరోడ్డులోని షిర్డీసాయి ఆలయంలో సాయినాథునికి వివిధ రకాల పుష్పాలతో నయనానందకరంగా అలంకరించారు. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యవర్గం ఆయనకు సాయిబాబా చిత్రపటం అందజేసి సత్కరించారు. సాయంత్రం సాయినాథున్ని పల్లకిలో ఆశీనులు గావించి ఆలయ ప్రాకోరోత్సవం చేశారు. వేణుగోపాల్నగర్లోని సద్గురు సాయినాథమందిరంలో ఉదయం పంచామృతాభిషేకాలు, కుంకుమార్చనలు, పుష్పార్చనలు చేశారు. భక్తులచే సమీకరించిన దాదాపు రూ.50లక్షలు విలువ చేసే స్వర్ణ కిరీటాన్ని సాయినాథుని మూలవిరాఠ్కు అలంకరించి పూజాదులు నిర్వహించారు. విజిలెన్స ఎస్పీ ముణిరామయ్య స్వామివారిని దర్శించుకోగా ఆయనకు ఆలయ కార్యవర్గం చేతులమీదుగా స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. వేమన టెలిఫోన భవన ఎదురుగా వున్న ఆలయంలో పురోహితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ విశేష పూజాది కైంకర్యాలు నిర్వహించారు. చెరువుకట్టమీద వెలసిన ఆలయంలో సాయినాథునికి వివిధరకాల పుష్పాలతో నయనమనోహరంగా అలంకరించి పూజలు నిర్వహించారు. రామచంద్రనగర్లోని షిర్డిసాయిబాబా మందిరంలో భక్తులు పెద్దసంఖ్యలో హాజరై దర్శించుకున్నారు. అలాగే హెచ్చెల్సీ కాలనీలోని చాముండేశ్వరి ఆలయ ఆవరణలో ఉన్న షిర్డిసాయి ఆలయం, వలీస్వామి ఆశ్రమం, హౌసింగ్బోర్డులోని అభయాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలోని బాబా మందిరం, అరవిందనగర్లోని సత్యసాయి కళ్యాణమండపం, శారదానగర్లోని శివబాలయోగి ఆశ్రమం, లక్ష్మినగర్లోని సాయిమందిరం ఇలా అన్నిప్రాంతాల్లోని ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకలను నిర్వహించారు. శారదానగర్లోని శంకరమఠంలో శంకరాచార్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలవద్ద పెద్దఎత్తున భక్తులకు అన్నదానం చేశారు.
బుక్కరాయసముద్రం: మండల కేంద్రంలోని చెరువుకట్టపై ఉన్న షిర్డిసాయి ఆలయంలో గురుపౌర్ణమి వేడుకులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం వేకుజామున నుంచే బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. చెన్నంపల్లి గ్రామంలో టీడీపీ నాయకుడు మల్లిఖార్జునరెడ్డి అధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలుతో పాటు అన్నదానం ఏర్పాటు చేశారు.
నార్పల: మండల కేంద్రంతో పాటు బొందలవాడ, పప్పూరు, తదితర గ్రామాల్లో ఆదివారం గురుపౌర్ణమి వేడుకులు ఘనంగా నిర్వహించారు. బొందలవాడ గ్రామంలోని సప్తగిరీష షిర్డీసాయి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయ వ్యవస్ధాపక అధ్యక్షుడు ఆలం నరసానాయుడు, ఆలం వెంకటనరసానాయుడు, ఆలం వెంకటరమణ, ట్రస్ట్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
ధర్మవరంరూరల్(కనగానపల్లి): మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం గురుపౌర్ణమి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్దలతో జరుపుకొన్నారు. మామళ్లపల్లిలోని షిర్డీసాయి ఆలయంలో ఉదయం నుంచి భక్తులు ప్రత్యేకపూజలు చేశారు. పాతపాళ్యం గ్రామంలోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో గురుపౌర్ణమి ఆరాధానోత్సవాన్ని నిర్వహించారు. పీఠాధిపతి గురువు కుళ్లాయిరెడ్డిస్వామి, శిష్యుడు రామయ్యస్వామి ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం, గంగ, గోపూజ నిర్వహించారు.
శింగనమల: మండల కేంద్రంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు చెరువు కట్టపై వెలసిన సాయి మందిరంలో ఆదివారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కమిటీ సభ్యులు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు
రామగిరి: మండల కేంద్రంలో షిర్డీసాయి మందిరంలో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బాబా విగ్రహానికి పురోహితుడు శివ పాలాబిషేకం, పుష్పాభిషేకం, గణపతిహోమం, నవగ్రహ హోమాలు నిర్వహించారు. అనంతరం మహామంగళహారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందించారు.
గార్లదిన్నె: మండలంలోని గార్లదిన్నె, కల్లూరు, కోటంక తదితర గ్రామాల్లో ఆదివారం గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం షిర్డిసాయిబాబను వివిధ పుష్పాలతో ప్రత్యేక అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.