Sanitation Department : పారిశుధ్య విభాగం.. కంపు..!
ABN , Publish Date - Jul 04 , 2024 | 11:37 PM
అనంతపురం నగరంలో అపరిశుభ్రత ఏ స్థాయిలో ఉందో.. నగరపాలికలోని పారిశుధ్య విభాగంలో అవినీతి కంపు అంతే స్థాయిలో ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆ విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి మొదట్లో ఇంటి నుంచి శుభ్రంగా మధ్యాహ్న భోజనం తెచ్చుకునేవారట. ఇప్పుడు రోజూ నగరంలోని రెస్టారెంట్లకు వెళుతున్నారని సమాచారం. తాను తినడంతోపాటు.. ఇంటికెళ్లే సమయంలో పార్శిల్ తీసుకుపోతుంటారని అంటున్నారు. పారిశుధ్య విభాగంలో చాలామంది కీలక ఉద్యోగులు నగర ...
అవినీతి ఆరోపణలు ఉన్నా.. అందలం
అమ్మకానికి శానిటరీ ఇనస్పెక్టర్ కుర్చీలు
కుక్క పిల్ల.. బిర్యానీ.. నగదు.. ఏదైనా ఇవ్వొచ్చు
ట్రేడ్ లైసెన్సుల పేరిట అదనపు వసూళ్లు
కాసులు కురిపిస్తున్న ప్లాస్టిక్ నిషేధం
అనంతపురం క్రైం, జూలై 4: అనంతపురం నగరంలో అపరిశుభ్రత ఏ స్థాయిలో ఉందో.. నగరపాలికలోని పారిశుధ్య విభాగంలో అవినీతి కంపు అంతే స్థాయిలో ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆ విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి మొదట్లో ఇంటి నుంచి శుభ్రంగా మధ్యాహ్న భోజనం తెచ్చుకునేవారట. ఇప్పుడు రోజూ నగరంలోని రెస్టారెంట్లకు వెళుతున్నారని సమాచారం. తాను తినడంతోపాటు.. ఇంటికెళ్లే సమయంలో పార్శిల్ తీసుకుపోతుంటారని అంటున్నారు. పారిశుధ్య విభాగంలో చాలామంది కీలక ఉద్యోగులు నగర పరిశుభ్రతకంటే.. అక్రమార్జన పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. మేస్త్రీ, శానిటరీ ఇనస్పెక్టర్ల పోస్టులు వారి జేబులు నింపుతున్నాయి. ట్రేడ్ లైసెన్సల పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్లాస్టిక్ నిషేధం పేరుతో తనిఖీలు చేస్తూ.. జేబులు నింపుకుంటున్నారు. ఇలా అవినీతిలో మునిగి తేలుతుంటే.. పాలకవర్గం ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తోంది. నగరపాలిక ఉన్నతాధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
ముడుపులు ఇచ్చారా..?
శానిటరీ ఇనస్పెక్టర్ పోస్టుల కోసం కొందరు భారీగా ముడుపులు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఒకరు రూ.70 వేలు, ఒక జూలు కుక్క పిల్లను కానుకగా సమర్పించారట. మరొకరు రూ.40 వేలు, ఇంకొకరు రూ.60 వేలు ఇచ్చారట. నిందారోపణలు ఎదుర్కొంటున్న ఓ ఉద్యోగి రూ.80 వేలు చెల్లించారని సమాచారం. ఇందులో అధికశాతం ఓ కీలక అధికారి జేబులోకి వెళ్లినట్లు సమాచారం. ఓ యువకుడిని మూడు నెలల క్రితం ఔట్సోర్సింగ్ వర్కర్గా తీసుకున్నారు. అతనికి రెండు నెలల జీతం రాకనే అప్పుడే మేస్త్రీ హోదా అప్పగించారట. రూ.80 వేలు సమర్పించుకుని.. అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.
సీటు కోసం లంచం..
పారిశుధ్యం విభాగంలో శానిటరీ ఇనస్పెక్టర్ల సీటు కావాలంటే అడిగినంత ఇవ్వాల్సిందే అని ప్రచారం జరుగుతోంది. నిబంధనల మేరకు రెగ్యులర్ ఉద్యోగులనే శానిటరీ ఇనస్పెక్టర్లుగా నియమించాలి. కానీ ఆ స్థానంలో మేస్త్రీలను నియమిస్తున్నారు. అందులోనూ అనుభవమున్న వారికి కాకుండా.. అక్రమార్కులకే చోటిస్తున్నారు. గతంలో సస్పెండ్ అయినవారిని అందలం ఎక్కించడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న వారిలో ఒకరికి మినహా.. అర్హత లేదని అంటున్నారు. నగరపాలిక పరిధిలో మొత్తం 50 డివిజన్లకు గాను ఆరు సర్కిళ్లు ఉన్నాయి. ఆ సర్కిళ్ల శానిటరీ ఇనస్పెక్టర్లే పారిశుధ్యాన్ని పర్యవేక్షిస్తారు. మూడు వారాల క్రితం కొన్ని శానిటరీ ఇనస్పెక్టర్ పోస్టుల్లో మేస్త్రీలను కూర్చోబెట్టారు. ఒకటో సర్కిల్కు హర్షవర్ధన, ఐదో సర్కిల్కు పాల్రాజును నియమించారు. వారిద్దరూ మేస్త్రీలుగా ఉన్న సమయంలో అప్పటి కమిషనర్ భాగ్యలక్ష్మి సస్పెండ్ చేశారు. వారికి రెండేళ్ల అనుభవం లేకపోయినా శానిటరీ ఇనస్పెక్టర్లుగా నియమించారు. మూడో సర్కిల్కు నియమించిన ఆంజినేయులుపై విజిలెన్స కేసు ఉంది. అతనికి ఆ పోస్టు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. రెండో సర్కిల్కి కేటాయించిన నాగేంద్ర సైతం మేస్త్రీ కావడం గమనార్హం.
ఇష్టారాజ్యం..
శానిటరీ సెక్రటరీల విషయంలో మరోసారి మార్పు చేశారు. మేస్త్రీగా ఉన్న వెంకటే్షను నాలుగు రోజుల క్రితం మరోసారి లైనలోకి తీసుకొచ్చారు. మూడో సర్కిల్ శానిటరీ ఇనస్పెక్టర్గా నియమించారు. మూడో సర్కిల్లో పనిచేస్తున్న ఆంజనేయులును ఐదో సర్కిల్కు మార్చారు. ఐదో సర్కిల్లో పనిచేస్తున్న పాల్రాజును ఆరో సర్కిల్కు మార్చి.. ఆ సర్కిల్లో శానిటరీ ఇన స్పెక్టర్గా పనిచేస్తున్న సచివాలయ సెక్రటరీని పక్కనపెట్టేశారు. అక్రమాలపై వివరణ కోరేందుకు కమిషనర్కు ఫోన చేయగా.. స్పందించలేదు.
అదనపు వసూళ్లు..?
నగర పరిధిలో దుకాణదారులు ట్రేడ్ లైసెన్స కోసం ఏడాదికి ఒకసారి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. చిన్న దుకాణమైతే రూ.500, వాణిజ్య దుకాణమైతే రూ.1000 నుంచి రూ.25 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిలోనూ శానిటేషన సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. కమర్షియల్ విభాగం విషయంలో ఈ వసూళ్లు ఎక్కువైనట్లు సమాచారం. తొలుత కీలక అధికారికి షాప్ చూపిస్తారని, ఆయన ఏదో లెక్కలు వేసి రూ.10వేలు అని చెబుతారని, దీంతో తగ్గించుకోవాలని దుకాణదారుడు బేరం పెడతారని సమాచారం. ఇలా.. దారికి తెచ్చుకుని.. సగానికి తగ్గించేస్తారని అంటున్నారు. నగరంలో వందల సంఖ్యలో పాఠశాలలు, కళాశాలలు, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద హోటళ్లు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి ట్రేడ్ లైసెన్స ఫీజు చెల్లించరు. అలాంటి వారి నుంచి ‘వనటైమ్’ సెటిల్మెంట్ చేసుకుని భారీగా వసూలు చేస్తున్నట్లు సమాచారం.
ఏం చేద్దామంటావ్ మరి..?
పారిశుధ్య విభాగంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ అధికారి స్థానికంగా లేరు. నిబంధనల ప్రకారం స్థానికంగానే ఉండాలి. కానీ ఆ సారు ఉదయం 6గంటలకు నగరానికి వచ్చేస్తారు. మొదట్లో ఇంటి నుంచి భోజనం తెచ్చుకునేవారు. కానీ అవినీతి కంపు తోడయ్యాక రెస్టారెంట్లకే వెళ్తారట. ప్రత్యేకంగా బిర్యానీ తెప్పిస్తారట. ఆయన కింద ఉన్న అవినీతి ఉద్యోగులు టిఫిన, మధ్యాహ్నం భోజన సౌకర్యం కల్పిస్తున్నారట. ఏదైనా కాలువల్లో మురుగు సరిగా వెళ్లడం లేదని శానిటేషన సెక్రటరీలు ఆయన దృష్టికి తీసుకెళ్తే ‘ఏం చేద్దామంటావ్ మరీ..? యంత్రాలు వస్తే మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోండి..’ అని అసహనం వ్యక్తం చేస్తారట. ప్టాస్లిక్ నిషేధం తనిఖీలకు శానిటేషన సెక్రటరీలను తీసుకువెళ్లడం లేదని సమాచారం. జరిమానాలను సైతం ఆనలైనలో ఎక్కించకుండా, కొంత మొత్తం జేబుల్లోకి మళ్లిస్తున్నట్లు సమాచారం. కొందరు రాజకీయ నాయకులు చెప్పిన దుకాణాలకు అసలే వెళ్ళడం లేదని తెలుస్తోంది.
నా దృష్టికి రాలేదు..
నగరపాలిక పారిశుధ్య విభాగంలో అవినీతి జరిగిన విషయం నా దృష్టికి రాలేదు. నగరంలో మూడు సర్కిళ్లు పారిశుధ్యం పనులను నేను పర్యవేక్షిస్తున్నాను. అయినా శానిటరీ ఇనస్పెక్టర్ల నియామక ఫైల్ నా వద్దకు రాదు. ఆ ఫైల్ నేరుగా కమిషనర్కు వెళ్తుంది.
- శ్రీహరి బాబు, అడిషనల్ కమిషనర్
మరిన్ని అనంతపురం వార్తల కోసం....