రంగు పడింది..!
ABN , Publish Date - Mar 26 , 2024 | 11:52 PM
ఎన్నికల కోడ్ అమలైనా ఆర్బీకేలకు వైసీపీ రంగులు అలాగే ఉంచారంటూ ఆంధ్రజ్యోతిలో ప్రచురిం చిన కథనంపై జిల్లా వ్యవసాయ యంత్రాంగం స్పందించింది.
అనంతపురం అర్బన, మార్చి 26 : ఎన్నికల కోడ్ అమలైనా ఆర్బీకేలకు వైసీపీ రంగులు అలాగే ఉంచారంటూ ఆంధ్రజ్యోతిలో ప్రచురిం చిన కథనంపై జిల్లా వ్యవసాయ యంత్రాంగం స్పందించింది. రైతు భరోసా కేంద్రాలకు పార్టీ రంగుల స్థానంలో తెలుపు రంగు వేశారు. అయితే రంగు మార్పు ఖర్చులు ఆయా మండలాల వ్యవసాయ అధికారులపైనే వేయడం విమర్శలకు దారితీస్తోంది. జిల్లా వ్యాప్తంగా 451 రైతు భరోసా కేంద్రాలున్నాయి. వీటిలో 280 ఆర్బీకేలను అద్దె భవనాల నుంచి ప్రభుత్వ సొంత భవనాల్లోకి మార్చారు. అప్పట్లో ఒక్కో ఆర్బీకేకు రంగులు వేసేందుకు రూ.15వేల నుంచి రూ.20 వేలు ఖర్చు చేశారు. ఈ లెక్కన రూ.67.65 లక్షలకుపైగా ఖర్చు చేశారు. తాజాగా ఎన్నికల కోడ్ అమలుతో పార్టీ రంగుల స్థానంలో తెలుపు కలర్ వేశారు. ఇందు కోసం ఒక్కో ఆర్బీకేకు రూ.5వేల నుంచి రూ.10వేలు ఖర్చు అవుతోంది. ఆయా ఆర్బీలకు తెలుపు కలర్ వేసేందుకు స్థానిక వ్యవసాయ అధికారులే ఖర్చు పెట్టుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఒక్కో అధికారికి రూ.50వేల నుంచి రూ.లక్ష దాకా భారం పడుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం సొంత భవనాల్లో ఏర్పాటు చేసిన ఆర్బీకేలకు పార్టీ రంగులు వేయలేదు. అద్దె భవనాలన్నింటిలోనూ పార్టీ రంగులు వేశారు. ఆర్బీకేల్లో వైఎ్సఆర్ పేరును తొలగించారు. అద్దె భవనాలకు పార్టీ రంగులు వేయకుండా ఉంటే తమకు ఈ అవస్థలు వచ్చేవి కాదంటూ వ్యవసాయ అధికారులు నిట్టూరుస్తున్నారు.