Former : కన్నీటి కర్బూజ
ABN , Publish Date - Jul 17 , 2024 | 10:59 PM
కర్బూజ రైతులకు ఊజి ఈగ కన్నీరు తెప్పిస్తోంది. పిందె దశలోనే సోకి.. కాయకు రంద్రాలు పెడుతోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో కర్బూజను విస్తారంగా సాగు చేస్తారు. ఇక్కడి నుంచి ఢిల్లీ మార్కెట్కు కూడా దిగుబడిని తరలిస్తారు. కానీ ఊజి ఈగ దెబ్బకు పంట సాగు చేయాలంటే రైతులు భయపడుతున్నారు. కంటికి కనిపించని ఊజి ఈగ పిందె దశలోనే రంధ్రాలు పెట్టేసి, రసాన్ని పీల్చేస్తోంది. దీంతో ఆ కాయ పనికిరాకుండా పోతోంది. ఆకుల మధ్యలో, పంట చుట్టు పక్కల...
పంటను దెబ్బతీస్తున్న ఊజీ ఈగ
పిందె దశలోనే ఆశించి.. రంధ్రాలు
తీవ్రంగా నష్టపోతున్న ఉద్యాన రైతు
కళ్యాణదుర్గం, జూలై 17: కర్బూజ రైతులకు ఊజి ఈగ కన్నీరు తెప్పిస్తోంది. పిందె దశలోనే సోకి.. కాయకు రంద్రాలు పెడుతోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో కర్బూజను విస్తారంగా సాగు చేస్తారు. ఇక్కడి నుంచి ఢిల్లీ మార్కెట్కు కూడా దిగుబడిని తరలిస్తారు. కానీ ఊజి ఈగ దెబ్బకు పంట సాగు చేయాలంటే రైతులు భయపడుతున్నారు. కంటికి కనిపించని ఊజి ఈగ పిందె దశలోనే రంధ్రాలు పెట్టేసి, రసాన్ని పీల్చేస్తోంది. దీంతో ఆ కాయ పనికిరాకుండా పోతోంది. ఆకుల మధ్యలో, పంట చుట్టు పక్కల ఊజీ ఈగ ఏర్పడుతోంది. సాగు చేసిన 28 రోజుల్లోనే పిందె ప్రారంభమవుతుంది. ఆ వెంటనే ఈగ దాడి మొదలవుతోంది. చల్లటి వాతావరణం ఉన్నప్పుడే కంటికి
కనిపించకుండా విజృంభిస్తోంది. రైతులు మందులను పిచికారీ చేస్తున్నా అదుపులోకి రావడం లేదు. పిందెకు రంధ్రం పెట్టినప్పుడు ఈగ కనిపించదు. కానీ కాయ దశలో రంధ్రం కాస్త పెద్దదిగా కనిపిస్తోంది. అప్పటికే కాయ పాడైపోతోంది. ఒక కిలో, ఒకటిన్నర కిలో ఉన్న కర్భూజ కాయలన్నింటికీ ఊజీ ఈగ రంధ్రాలు పెట్టేయడంతో పూర్తిగా చెడిపోతున్నాయి.ఊజీ ఈగ దెబ్బకు కొన్ని సందర్భాల్లో తోటల్లోనే కాయలను వదిలేస్తున్నారు.
రూ.3 కోట్ల నష్టం..
ఊజీ ఈగను నివారించేందుకు రైతులు ఎకరానికి రూ.4 వేల దాకా ఖర్చు చేస్తున్నారు. అయినా ఫలితం కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. పైగా టమోటా, కళింగర పంటలకు కూడా సోకుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంబదూరు, కుందుర్పి, శెట్టూరు, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం రూరల్ మండలాల్లో 350 ఎకరాలలో కర్బూజా సాగు చేశారు. ఎకరానికి రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఐదు ఎకరాల్లో సాగు చేస్తే 25 నుంచి 35 టన్నుల దిగుబడి వస్తుంది. కానీ ఊజీ ఈగ దెబ్బకు 5 నుంచి 6 టన్నులకు దిగుబడి పడిపోయిందని రైతులు వాపోతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కర్బూజ రైతులు రూ.3 కోట్లకు పైగా నష్టపోయారు.
సాగుకు వెనుకడుగు..
ఊజి ఈగ దెబ్బకు కర్బూజా సాగు చేయాలంటేనే భయమేస్తోంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు.. పంటం మొత్తం దెబ్బతింటోంది. అందుకే కర్బూజ మానేసి.. ఉన్న మూడు ఎకరాల్లో టమోటా, వేరుశనగ పంటలను ఎక్కువగా సాగు చేస్తున్నాను.
- హనుమంతరాయుడు, జెల్లిపల్లి
మొదట్లో అయితే నివారించవచ్చు
నాకున్న నాలుగు ఎకరాల్లో కర్బూజ సాగు చేశాను. ఇప్పటికి 50 రోజులు దాటింది. ఊజి ఈగను మొదట్లోనే గుర్తిస్తే మందులు పిచికారీ చేసి నివారించడం సాధ్యమవుతుంది. లేకుంటే పంట చేయిదాటిపోతుంది. నేను మొదట్లోనే గుర్తించాను. ఖరీదైన మందులను వినియోగించి ఊజి ఈగను చంపేయగలిగాను. కర్బూజ సాగులో నాకు అనుభవం ఉన్నందుకే ఇది సాధ్యమైంది.
-అశ్వత్థ, ములకనూరు
మరిన్ని అనంతపురం వార్తల కోసం....