పేదలను నిర్లక్ష్యం చేస్తున్న వైసీపీ
ABN , Publish Date - Feb 02 , 2024 | 11:20 PM
పేదలకు కనీస సౌకర్యాలైన నివాస స్థలాలు, గృహ నిర్మాణాల తదితర వాటిని కల్పించకుండా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని జైభీమ్ పార్టీ నాయకులు మండిపడ్డారు
అనంతపురం సెంట్రల్, ఫిబ్రవరి 2: పేదలకు కనీస సౌకర్యాలైన నివాస స్థలాలు, గృహ నిర్మాణాల తదితర వాటిని కల్పించకుండా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని జైభీమ్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ కన్వీనర్ గౌరినరేష్, ఎమ్మార్పీఎస్ వెంకటేష్ మాట్లాడుతూ... పేదల అవసరాలను తీర్చేందుకు వినియోగించాల్సిన ప్రభుత్వ స్థలాలను అధికారులు పెద్దలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. వేలాది మంది పొట్టచేతపట్టుకుని నగరానికి వలసవస్తూ రూరల్ ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారన్నారు. కురుగుంట పరిధిలో అనేక సర్వే నెంబర్లలో ప్రభుత్వ స్థలాలు ఖాళీగున్నాయన్నారు. వాటిలో పేదలకు నివేశ స్థలాలను కేటాయించి పక్కాగృహాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతి పత్రాన్ని కలెక్టరేట్ అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు లోకేష్, నరసింహులు, ముత్యాలన్న, షాహిద, రెడ్డెమ్మ, మహాలక్ష్మి, షాహినతాజ్, లక్ష్మిదేవి, కాంతమ్మ, గంగన్న, చౌడప్ప పాల్గొన్నారు.