పుంగనూరులో టీడీపీ కార్యకర్తపై దాడి
ABN , Publish Date - Jun 06 , 2024 | 12:05 AM
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఘనవిజయాన్ని జీర్ణించుకోలేని వైసీపీ కార్యకర్త పుంగనూరులో ఆ పార్టీ కార్యకర్తపై దాడి చేశాడు
పుంగనూరు, జూన్ 5: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఘనవిజయాన్ని జీర్ణించుకోలేని వైసీపీ కార్యకర్త పుంగనూరులో ఆ పార్టీ కార్యకర్తపై దాడి చేశాడు. బుల్లెట్తో ఢీకొట్టి హతమార్చబోయాడు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పుంగనూరు ఉబేదుల్లా కాంపౌండ్లో కాపురమున్న షేక్ షామీర్, సయ్యద్ అలియాస్ జంగిల్ చురుకైన టీడీపీ కార్యకర్తలు. సయ్యద్ కౌంటింగ్సెంటర్లో టీడీపీ ఏజెంట్గా ఉండగా అతడి స్నేహితులకు రాతిమసీదు వీధిలో కాపురం ఉన్న ఎస్.నజీర్ కుమారుడు వైసీపీ కార్యకర్త ఎస్.ఇర్ఫాన్ ఫోన్లో వార్నింగ్ ఇచ్చాడు. బుధవారం ఉదయం టీడీపీ కార్యకర్త షామీర్ ఈవిషయంపై విచారించడానికి ఇమ్రాన్ ఇంటివద్దకు వెళ్లారు. ఇతడిపై వైసీపీ కార్యకర్త ఇమ్రాన్ మరికొందరు దాడి చేసి చొక్కా చింపి కొట్టారు. ఇందిరాసర్కిల్లో కొత్తయిండ్లుకు చెందిన నాగరాజ, దూళ్లవాండ్లఇండ్లుకు చెందిన రాఘవతో షామీర్ మాట్లాడుతున్నారు. అదే సమయంలో వైసీపీ కార్యకర్తలు ఇర్ఫాన్, అష్రఫ్ బుల్లెట్ (ద్విచక్రవాహనం)లో వేగంగా వచ్చి వెనుకవైపు నుంచి అతడిని ఢీకొట్టారు. దీంతో కిందపడిపోయిన తనను స్నేహితులు పైకిలేపి అడ్డురావడంతో.. వారినీ ఇమ్రాన్ దుర్భాషలాడి దాడి చేశాడని షామీర్ తెలిపారు. రాఘవను కులం పేరుతో దూషించినట్లు చెప్పారు. తనను అసభ్యకరంగా బూతులు తిడుతూ దాడి చేసి బుల్లెట్తో ఢీ కొట్టి హతమార్చాలని ప్రయత్నించిన వైసీపీ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు.