బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించాలి
ABN , Publish Date - Jan 07 , 2024 | 12:11 AM
సార్వత్రిక ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో సెక్టోరల్ అధికారుల పాత్ర అధికంగా ఉంటుందని డీఆర్వో రాజశేఖర్ అన్నారు.
సెక్టోరల్ అధికారులకు డీఆర్వో రాజశేఖర్ సూచన
చిత్తూరు కలెక్టరేట్, జనవరి 6: సార్వత్రిక ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో సెక్టోరల్ అధికారుల పాత్ర అధికంగా ఉంటుందని డీఆర్వో రాజశేఖర్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో ఆర్డీవోలు, మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్, సెక్టోరల్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై ఒక్కరోజు శిక్షణా తరగతులు జరిగాయి. శిక్షణా తరగతులను ప్రారంభించిన డీఆర్వో మాట్లాడుతూ ఈనెల 22న ఓటర్ల తుదిజాబితా విడుదల చేస్తామని చెప్పారు. సెక్టోరల్ అధికారులు, బీఎల్వోలు ఎన్నికల నిబంధనలను అనుసరించి బాధ్యతలు నిర్వహించాలని అన్నారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు బీఎల్వోల పాత్ర అత్యంత ప్రాధాన్యమైనదని తెలిపారు. సెక్టోరల్ అధికారులు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించి మ్యాపింగ్ చేసుకుని కమ్యూనికేషన్ వ్యవస్థ, పోలీసులతో కలిపి శాంతిభద్రతల నివేదిక తయారుచేయాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక భద్రతకోసం నివేదికలు అందించాలన్నారు. ఈవీఎంల పట్ల అవగాహన పెంచేందుకు, మరింత పోలింగ్శాతం పెంచేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగరి ఆర్డీవో సృజన, చిత్తూరు ఏఎస్వో సుందర్రాజన్లు శిక్షణ ఇవ్వగా, ఆర్డీవోలు మనోజ్కుమార్ రెడ్డి (పలమనేరు), శ్రీనివాసులు (కుప్పం), ఎన్నికల సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.