డీవీ సత్రం డిపోలో ఇసుక భద్రమేనా ... ?
ABN , Publish Date - Jun 29 , 2024 | 02:11 AM
అర్ధరాత్రి వేళ తరలించేందుకు ప్రయత్నాలు
![డీవీ సత్రం డిపోలో ఇసుక భద్రమేనా ... ?](https://media.andhrajyothy.com/media/2024/20240625/28dvs1_w_a9df70ecfc_v_jpg.webp)
దొరవారిసత్రం, జూన్ 28 : గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు చాలామంది ఇసుక వ్యాపారంలో రూ.కోట్లు గడించారు.నదులను తోడి తీసుకొచ్చిన ఇసుకను ప్రభుత్వం డిపోలు ఏర్పాటు చేసి విక్రయించింది. ఆ క్రమంలోనే సూళ్లూరుపేట నియోజకవర్గంలోని అన్నీ ప్రాంతాలకు ఇసుక సరఫరా చేసేందుకు దొరవారిసత్రం మండలంలోని నేతాజీనగర్ వద్ద జాతీయ రహదారి పక్కనే ఇసుక డిపో ఏర్పాటు చేసింది. ఆ డిపో నుంచీ కోట్లాది రూపాయల వ్యాపారం జరిగింది. వాకాడు ప్రాంతాల నుంచి స్వర్ణముఖి ఇసుకను తీసుకు వచ్చి ఇక్కడ డిపోలో నిల్వ చేసి విక్రయాలు చేపట్టారు.ఈ డిపోలో భారీగా ఇసుక నిల్వలున్నాయి. గత ప్రభుత్వంలో విక్రయాలు జరిపిన గుత్తేదారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక భారీగా డిపోలో ఇసుక నిల్వ చేశారు. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడంతో ఆ ఇసుకను రాత్రి వేళల్లో తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇటీవల ఈ డిపోను పరిశీలించిన జిల్లా మైనింగ్ శాఖ అధికారులు ఆ ఇసుక నిల్వలను సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. డిపో వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేయించారు. అయితే ఈ కాస్త భద్రతతో ఇసుక నిల్వలను కాపాడడం కష్టమే.అధికార యంత్రాంగం మేలుకోకపోతే ఈ డిపోలోని ఇసుక తమిళనాడు, బెంగుళూరుకు తరలిపోయే అవకాశముంది.