నాని ధర్మపోరాటాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి
ABN , Publish Date - Jan 17 , 2024 | 02:09 AM
చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్లపై పులివర్తి నాని ఆరు నెలలుగా ధర్మపోరాటం చేస్తున్నారు. ప్రజలు కూడా ఆయన పోరాటాన్ని గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు అన్నారు.
చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్లపై పులివర్తి నాని ఆరు నెలలుగా ధర్మపోరాటం చేస్తున్నారు. ప్రజలు కూడా ఆయన పోరాటాన్ని గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు అన్నారు.నానీని ఆయన నివాసంలో పరామర్శించాక మీడియాతో మాట్లాడుతూ ‘చంద్రగిరి నియోజకవర్గంలో 6 మండలాలున్నాయి. పక్కనే తిరుపతి, శ్రీకాళహస్తి, జీడీ నెల్లూరు, పుంగనూరు, పూతలపట్టు, పీలేరు నియోజకవర్గాల్లో ఇక్కడి ఓటర్లను అక్కడికి, అక్కడి ఓటర్లను ఇక్కడికి మార్చేశారు. వైసీపీ వాళ్లు చేసే మోడ్ ఆఫ్ ఆపరేషన్ అంతుచిక్కని విధంగా ఉంది. ఫామ్ 6, 7, 8లను విచ్చలవిడిగా వినియోగించారు. 2019లో 290000 ఓట్లకు 325 బూత్లు ఉంటే, ఇప్పుడు 308000 ఓట్లకు 395 బూత్లకు పెంచేశారు.ఎమ్మెల్యే స్వగ్రామం తుమ్మలగుంటలో 4 బూత్లను 7 చేశారు. 37వేల ఓట్లు మార్పులు, చేర్పులు వచ్చాయి. ఫామ్ 6 ద్వారా 25వేల కొత్త ఓట్లు చేర్చారు. అందులో 40 నుంచి 80 ఏళ్ల వయస్సు గల 6వేల మంది కొత్త ఓటర్లు వచ్చారు. వారు ఎక్కడనుంచి వచ్చారో తెలియదు.ఒకే ఫొటో (పీఎ్సఈ)కలిగినవి 13800 ఓట్లున్నాయి. సంగీత హరి పేరుతో తిరుపతిలో ఒకటి, హరి సంగీత పేరుతో చంద్రగిరిలో మరొక ఓటును చేర్చారు. దువ్వాల క్రాంతి, మల్లంగుంట మహేష్, నందిని బసుమూర్తి, మల్లగుంట్ల బలరాముడు, సతీ్షకుమార్ అల్లంపాటి, మరిశెట్టి గురవయ్య వంటి పేర్లను శ్రీకాళహస్తి, చంద్రగిరి, తిరుపతి, సత్యవేడు నియోజకవర్గాల్లో ఇంటిపేరును అటూ, ఇటూ మార్చి, ఫోటోలు బ్లర్ చేసి చేర్చారు. దీన్నిబట్టి అధికారులు వైసీపీతో ఏస్థాయిలో కుమ్మక్కయారో తెలుస్తోంది. బూత్లు మార్చారు. నియోజకవర్గాలు మార్చారు. వారి ఇష్టానుసారం చేసిపెట్టారు. పేరును నెంబర్లు మార్చేసి మూడు బూత్లలో వేశారు. కరుడుకట్టిన నేరస్తులు, ఉగ్రవాదుల కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే ఓటరు అవకతవకలపైన చంద్రగిరిని కేస్ స్టడీగా ఎన్నికల సంఘాన్ని తీసుకోమన్నాం’ అని చెప్పారు. మాజీ మంత్రులు అమరనాథ రెడ్డి, పరసారత్నం, టీడీపీ నేతలు నరసింహ యాదవ్, గాలి భానుప్రకాష్ తదితరులు ఆయన వెంట వున్నారు.