రెచ్చిపోతున్న ఇసుకాసురులు
ABN , Publish Date - Jun 23 , 2024 | 02:06 AM
మండలంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రాత్రికి రాత్రి ఇసుక తవ్వడమేగాక పక్క రాష్ర్టాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
ప్రభుత్వం మారినా యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు
గంగవరం, జూన్ 22: మండలంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రాత్రికి రాత్రి ఇసుక తవ్వడమేగాక పక్క రాష్ర్టాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కలగటూరు నుంచి కూర్నిపల్లె, గంగవరం, జీడిమాకులపల్లె, క్యాటిల్ఫామ్ పరిధిలోని కౌండిన్య నదీ కాలువలో ఇప్పటికే 80 శాతం పైగా ఇసుక గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుకాసురులు మింగేశారు. అయితే వారం రోజులుగా పోలీసులు వరుస తనిఖీలు చేపడుతుండడం ఇసుకాసురులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో పగలు తవ్వకాలు మానేసి, రాత్రిపూట ప్రారంభించారు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు శుక్రవారం రాత్రి జీడిమాకుల పల్లె సమీపంలోని కౌండిన్య నదీకాలువ వద్ద కాపుకాశారు. అక్రమార్కులు టార్చిలైట్ల సహాయంతో ఇసుకను ట్రాక్టర్లో లోడింగ్ చేస్తుండగా, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇసుక ట్రాక్టర్ను సీజ్ చేసి గంగవరం పోలీ్సస్టేషన్కు తరలించామని గంగవరం అర్బన్ సీఐ చిన్నగోవిందు తెలిపారు.