పట్టుకుంది మేమే.. అయినా పూర్తి వివరాలు తెలియదు
ABN , Publish Date - Apr 12 , 2024 | 12:29 AM
‘కోడిపందేల స్థావరంపై దాడిచేసి పట్టుకుంది మేమే. అయితే వారి వివరాలు మాత్రం మాకు ఇంకా తెలియదు’ అని పోలీసులు చెప్పుకొచ్చారు.
కోడి పందేల వ్యవహారంపై పోలీసుల మాట
గంగాధరనెల్లూరు, ఏప్రిల్ 11: ‘కోడిపందేల స్థావరంపై దాడిచేసి పట్టుకుంది మేమే. అయితే వారి వివరాలు మాత్రం మాకు ఇంకా తెలియదు’ అని పోలీసులు చెప్పుకొచ్చారు. గంగాధరనెల్లూరు మండలం పాపిరెడ్డిపల్లె గ్రామానికి సమీపంలో గురువారం కొంతమంది వ్యక్తులు కోడి పందేలు ఆడుతున్నారని పోలీసులుకు సమాచారం అందింది. ఈ మేరకు సీఐ శంకర్ తన సిబ్బందితో కలిసి కోడి పందేల స్థావరంపై దాడిచేశారు. అక్కడ డబ్బు, కోడిపుంజులు, ద్విచక్ర వాహనాలు, పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకుని ఫొటో దిగారు. వీరందరినీ సాయంత్రం 5.30 గంటలకు తీసుకువచ్చారు. ఈ కేసు విషయంపై గురువారం రాత్రి 9.12 గంటలకు సీఐ శంకర్కు ఫోన్చేసి వివరాలు అడగ్గా. ఏడు పందెం కోళ్లు, రూ.11వేల నగదు, 6 ద్విచక్ర వాహనాలు, 6 కోడికత్తులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తుల పేర్లు మాత్రం ఇంకా తెలియదని సీఐ పేర్కొన్నారు. సుమారు 4గంటలకు పైగా స్టేషన్లో పందెం రాయుళ్లను పెట్టుకున్నప్పటికీ వారి గురించి వివరాలు తెలియదని చెప్పడం గమనార్హం.