AP News: ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు గుడ్న్యూస్.. తేదీలు ఫిక్స్!
ABN , Publish Date - Jun 27 , 2024 | 03:16 PM
ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్న్యూస్. డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్ తుది కసరత్తు చేస్తోంది.
అమరావతి: ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్న్యూస్. డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్ తుది కసరత్తు చేస్తోంది. రెండు రకాలుగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. గత ప్రభుత్వం చేసిన తప్పిదం కారణంగా రెండు రకాలుగా నోటిఫికేషన్ ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొందని ప్రభుత్వం భావిస్తోంది.
కాగా గత ప్రభుత్వం మూడేళ్ల నుంచి టెట్ పరీక్ష నిర్వహించలేదు. అందుకే టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి మెగా డీఎస్సీకి ఒక నోటిఫికేషన్ ఇవ్వాలని చంద్రబాబు సర్కారు భావిస్తోంది. టెట్ పరీక్షల్లో అర్హత పొందిన వారికి నేరుగా మెగా డీఎస్సీకి వేరే నోటిఫికేషన్ ఇవ్వనుంది. కాగా ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు ఈ నెల 30న విడుదల కానున్నాయని తెలుస్తోంది. ఇక డిసెంబర్ 10 నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేలా మెగా డీఎస్సీ షెడ్యూల్ రూపొందించనున్నట్టు సమాచారం.
ఆయా జిల్లాల్లోని స్థానికులతోనే 80 శాతం టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఇక మెగా డీఎస్సీ నోటిఫికేషన్లో భాగంగా ప్రభుత్వం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనుంది. పాఠశాల విద్యా శాఖ పరిధిలో 13,661 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2024 టీచర్ పోస్టులు భర్తీకానున్నాయి. ఇక విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో 49 టీచర్ పోస్టులు, బాల నేరస్తులకు విద్యా బోధన కోసం 15 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి.