కూలీలపై తేనెటీగల దాడి
ABN , Publish Date - May 30 , 2024 | 01:14 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నరేంద్రపురం శివారు బూరుగుగుంటలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. 20 మంది గాయపడగా తీవ్ర అస్వస్థతకు గురైన ఒక మహిళను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
పి.గన్నవరం, మే 20: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నరేంద్రపురం శివారు బూరుగుగుంటలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. 20 మంది గాయపడగా తీవ్ర అస్వస్థతకు గురైన ఒక మహిళను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... బూరుగుగుంట గ్రామ పరిధిలో జంగిల్ క్లియరెన్స్లో భాగంగా 192 మంది ఉపాధి హామీ కూలీలు పని చేస్తున్నారు. ఈ క్రమంలో గోరింకల డ్రెయిన్ చెంతనే పేరుకుపోయిన పొదలను 50 మంది కూలీలు తొలగిస్తున్నారు. పొదల్లో ఉన్న తేనె పట్టుకున్న తేనెటీగలు ఒక్కసారిగా కూలీలపై దాడి చేశాయి. 20 మంది తీవ్ర గాయాలపాలుకాగా స్థానికులు వారిని 108 అంబులెన్స్లో పి.గన్నవరం సీహెచ్సీకి తరలించారు. వైద్యుడు యు.రాఘవేంద్రరావు, హెడ్ నర్స్ జీఎల్ అనంతకుమారి, సిబ్బంది సీహెచ్ మణితేజ వైద్య సేవలందించారు. భీమవరపు యశోద పరిస్థితి మెరుగుపడక పోవడంతో వైద్యుల సూచన మేరకు ఆమెను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న కూలీలను ఎంపీడీవో సీహెచ్ త్రిశూలపాణి, ఇన్చార్జి ఏపీవో లక్ష్మీనారాయణ పరామర్శించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పి.గన్నవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ స్థానిక నాయకులతో కలిసి కూలీలను పరామర్శించి వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.