రైతుల భూమి తాకట్టులో ఉన్నట్టే..
ABN , Publish Date - May 08 , 2024 | 01:08 AM
జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో రైతుల భూమి తాకట్టులో ఉన్నట్టేనని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు.
ఉప్పలగుప్తం, మే 7: జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో రైతుల భూమి తాకట్టులో ఉన్నట్టేనని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. రైతులు అప్రమత్తమై ఎన్నికల్లో వైసీపీని ఓడించడం ద్వారా తమ ఆస్తులకు రక్షణ కల్పించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో అరిగెల నరసింహారావు స్వగృహం వద్ద మంగళవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో చినరాజప్ప మాట్లాడారు. అసలు చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వం చేసిన మార్పులతో చట్టానికి అర్థం లేకుండా పోయిందన్నారు. పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకోవడం వెనుక మర్మమేమిటో రైతులు గమనించాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలు కాకుండా చూస్తామన్నారు. అమలాపురం అసెంబ్లీ కూటమి అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ రైతుల ప్రాథమిక హక్కును హరించేలా చట్టాన్ని తమ స్వప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వం రూపొందించిన తీరు దారుణమన్నారు. జనసేన నాయకుడు ఇసుకట్ల రఘుబాబు మాట్లాడుతూ రైతులంతా ఈ చట్టాన్ని వ్యతిరేకించకపోతే భూయాజమాన్య హక్కును కోల్పోవడం ఖాయమన్నారు. సమావేశంలో టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు అరిగెల నానాజీ, బీసీ నాయకుడు లంకే భీమరాజు, ఎస్సీ నాయకులు పెయ్యల దుర్గారావు, బూసి బుజ్జిదొర, జనసేన నాయకులు అయితాబత్తుల ఉమా, చిక్కం సూర్యమోహన్, మంచెం బాలకృష్ణ, గనిశెట్టి కిశోర్ పాల్గొన్నారు.