పేదోడికి పప్పన్నం కరువాయె!
ABN , Publish Date - May 22 , 2024 | 12:33 AM
పేదోళ్ళ కందిపప్పుకు వైసీపీ ప్రభుత్వం గండికొట్టింది. మార్కెట్లో పప్పుధరలు మండిపోతున్న సమయంలో పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసి పేద కుటుంబాల్లో పప్పులేకుండా చేసింది.
ఐదు నెలలుగా రేషన్లో పంపిణీ నిల్
మార్కెట్లో కేజీ రూ.175 నుంచి రూ.200
జిల్లాలో 5.73 లక్షల కుటుంబాలకు అందలేదు
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
పేదోళ్ళ కందిపప్పుకు వైసీపీ ప్రభుత్వం గండికొట్టింది. మార్కెట్లో పప్పుధరలు మండిపోతున్న సమయంలో పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసి పేద కుటుంబాల్లో పప్పులేకుండా చేసింది. ప్రస్తుతం జిల్లాలోని వివిధ మార్కెట్లలో కేజీ కందిపప్పు రూ.175 వరకూ విక్రయిస్తున్నారు. సాధారణంగా మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ఆదుకుంటుంది. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం పేదల కడుపుకొట్టింది. గతేడాది అక్టోబరు నుంచే కం దిపప్పు సరఫరా తగ్గించారు. హాస్టల్, అంగన్వాడీలకు కొంతవరకూ సర ఫరా చేస్తున్నారు. గత డిసెంబర్లో జిల్లాలో కొద్ది ప్రాంతంలో మాత్రమే అడిగిన వారికి ఇచ్చేవారు. రెండు నెలల నుంచి మొత్తం ఎంఎల్ పాయిం ట్లన్నీ ఖాళీ. కందిపప్పు ఊసెత్తడం లేదు. డీలర్లు మాత్రం డిసెంబరు నుంచే మాకు కందిపపప్పు సరఫరా చేయడం మానేశారని చెప్పడం గమనార్హం. జిల్లాలో 5.73 లక్షల రేషన్కార్డులు ఉన్నాయి. వాటన్నింటికీ ఒక్కో రేషన్కార్డుకు రూ.కేజీ వంతున కందిపప్పు అమ్మేవారు. దీని ధర రూ.67 ఉండేది. ఇది ప్రజలకు బాగా ఉపయోగపడేది. ఇవాళ మార్కెట్లో కందిపప్పు కొనలేక పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సూపర్ మార్కెట్లలో కేజీ పప్పు ధర రూ.200 దాటేసింది. మార్కెట్లో నియంత్రణ లేకపోవడం వల్ల ఎవరి ఇష్టానుసారం వారు అమ్మేస్తున్నారు. ఎన్నికల ముందు కూడా ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదు. అధికా రులు మాత్రం ఇంకా కందిపప్పు పంపిణీ చేస్తున్నామని బొంకుతున్నారు. ఎక్కడ ఎవరికి ఇస్తున్నారని ఆరా తీస్తే రెండునెలల నుంచి పప్పు అందడం లేదని ప్రజలు చెబుతున్నారు. మొత్తం మీద నెలకు జిల్లాకు 573 టన్నుల కందిపప్పు అవసరం. ఇంటింటీకి రేషన్ అని గొప్పలు చెబుతూ వైసీపీ ఒక్కోక్కటి వంతున రేషన్ తగ్గించుకుంటూ వస్తుంది. ఈ నెలలో గోధుమ పిండి ఇవ్వడంలేదు. ప్రస్తుతం బియ్యం, అరకేజీ పంచదార మాత్రమే ఇస్తున్నారు.గత తెలుగుదేశం ప్రభుత్వంలో బియ్యం, పంచదార, కందిపప్పు, వంటనూనె వంటివి ఇచ్చేవారు. ఇవాళ బియ్యం సక్రమంగా సరఫరా చేయ లేని పరిస్థితి. గత నెలలో కొంతమందికే బియ్యం ఇచ్చారు. బియ్యం కోసం అనేకమంది రేషన్షాపులు, ఎండీయూ వాహనాల చుట్టూ తిరిగారు. కొద్ది నెలల కిందట ప్రధాని మోదీ మరో మూడేళ్ల పాటు ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.వైసీపీ ప్రభుత్వం దానిని ఇప్పటి వరకూ అమలు చేయలేని పరిస్థితిలో ఉండడం గమనార్హం.