Share News

కవలగొయ్యిలో వ్యక్తి హత్య

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:27 AM

వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన బొమ్మూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. అతని తల్లి పలుకూరి సరోజిని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం..

కవలగొయ్యిలో వ్యక్తి హత్య

రాజమహేంద్రవరం, మార్చి 28(ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన బొమ్మూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. అతని తల్లి పలుకూరి సరోజిని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్‌ కవలగొయ్యి ప్రాంతానికి చెందిన సరోజిని చిన్న కుమారుడు భాస్కరరావు(35)కు సత్యవాణితో 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. తర్వాత మనస్పర్థల వల్ల 12 ఏళ్ల క్రితమే కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. దీంతో భాస్కరరావు తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. అదే ప్రాంతంలో పాత ఇనుము వ్యాపారం చేసే గుజ్జు లక్ష్మి భర్తతో గొడవల వల్ల ఐదేళ్ల నుంచి విడిగా ఉంటోంది. భాస్కరరావుకు ఆమెతో పరిచయం ఏర్పడి మూడున్నరేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నాడు. ఈ మధ్య భాస్కరరావును ఇంటికి రావద్దంటూ లక్ష్మి దూరం పెట్టింది. దీంతో అతడు తాగుడుకు బానిసయ్యాడు. ఇదిలా ఉండగా.. భాస్కరరావుతో కందిరెల్లి నారాయణమూర్తి అనే వ్యక్తి కొన్ని రోజులుగా పరిచయం పెంచుకున్నాడు. అతడితో లక్ష్మికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో భాస్కరరావును నారాయణమూరి లక్ష్మీనగర్‌లో ఉన్న గంగుల సూర్యనారాయణ లేఅవుట్‌ దగ్గరలో వాచ్‌మన్‌ నివాసం ఉండే పాక వద్దకు తీసుకెళ్లి మందు తాగించాడు. అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో భాస్కరరావును పొడుస్తుండగా వాచ్‌మన్‌ చూసి పారిపోయాడు. గురువారం ఉదయం తన వద్దకు వచ్చి వాచ్‌మన్‌ విషయం చెప్పగా అక్కడకు వెళ్లి చూడగా తన కొడుకు భాస్కరరావు రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడని సరోజిని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Updated Date - Mar 29 , 2024 | 12:27 AM