దారి దోపిడీ దొంగలు అరెస్టు
ABN , Publish Date - Jun 02 , 2024 | 01:40 AM
దోపిడీ దొంగలను రామచంద్రపురం అరెస్టు చేశారు.
రామచంద్రపురం(ద్రాక్షారామ), జూన్1: దోపిడీ దొంగలను రామచంద్రపురం అరెస్టు చేశారు. సీఐ పి.దొరరాజు, ఎస్ఐ కె.సురేష్బాబు తెలిపిన వివరాలివి. రామచంద్రపురం రాజబాబునగర్కు చెందిన రౌడీషీటర్ గంపల విజయశేఖర్ అలియాస్ పండుపై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతడు మిత్రులతో కలిసి దోపిడీలకు పాల్పడుతున్నాడు. మే 30వతేదీ రాత్రి 10.30గంటలకు కొత్తూరుకు చెందిన గండ్రోతు వీరకిషోర్ పని ముగించుకుని మోటారుసైకిల్పై ఇంటికి వెళ్తున్నాడు. కిషోర్ను నలుగురు వ్యక్తులు ఆపి కత్తులతో బెదిరించి అతని వద్ద నుంచి రూ.2వేలు నగదు, సాయిబాబా బంగారు ఉంగరం లాక్కుని పరారయ్యారు. మరో వ్యక్తిని ఆపగా అతడు ఖాకీ రంగు ఫ్యాంట్ ధరించి ఉండటంతో పోలీసుగా భావించి వదలివేశారు. అనంతరం కార్లో వెళుతున్న మరో వ్యక్తిని ఆపి బెదిరించి రూ.2వేలు లాక్కున్నారు. విలువైన వస్తువుల కోసం కత్తులతో బెదిరించగా భయపడి ఆ వ్యక్తి కారు వేగంగా నడుపుకుంటూ వెళ్లిపోయాడు. శనివారం మళ్లీ దొంగతనం చేసేందుకు ప్రణాళిక రూపొందించుటకు పండు, నాని, చిన్నిలు స్థానిక వైఎస్ఆర్నగర్ వద్ద రైల్వేస్టేషన్ వద్ద కూర్చుని నాగబాబు కోసం చూస్తుండగా పోలీసులు చాకచక్యంగా దాడిచేసి అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వీరి వద్ద నుంచి చాకులు, నగదు, మోటారుసైకిల్ స్వాధీనం చేసుకుని స్థానిక కోర్టులో హాజరుపరచినట్లు సీఐ తెలిపారు. కొత్తూరుకు చెందిన గండ్రోతు వీరకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఎస్పీ శ్రీధర్ ఆదేశాలతో డీఎస్పీ బి.రామకృష్ణ పర్యవేక్షణలో సీఐ దొరరాజు, ఎస్ఐ సురేష్బాబు సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. రామచంద్రపురం మండలం చోడవరం బైపాస్రోడ్డులో దారి దోపిడీలకు పాల్పడిన రాజబాబునగర్కు చెందిన గంపల విజయశేఖర్ అలియాస్ పండు, తుమ్మలపల్లి లేమేకు ఆంబ్రోస్ అలియాస్ నాని, తాతపూడి చిన్ని లను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.