కూటమికి పట్టం కట్టిన ప్రజలకు కృతజ్ఞతలు : యనమల
ABN , Publish Date - Jun 06 , 2024 | 12:24 AM
తుని రూరల్, జూన్ 5: కూటమికి పట్టం కట్టిన రాష్ట్ర ప్రజలకు శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాతీర్పుతో కూటమి చరిత్ర సృష్టించిందని మండలంలోని తేటగుంట టీడీపీ కార్యాలయంలో యనమల రామకృష్ణుడు మీడియాకు వెల్లడించారు. ప్రజలు తీర్పుతో టీడీపీ
తుని రూరల్, జూన్ 5: కూటమికి పట్టం కట్టిన రాష్ట్ర ప్రజలకు శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాతీర్పుతో కూటమి చరిత్ర సృష్టించిందని మండలంలోని తేటగుంట టీడీపీ కార్యాలయంలో యనమల రామకృష్ణుడు మీడియాకు వెల్లడించారు. ప్రజలు తీర్పుతో టీడీపీ తునిలో మరోసారి చరిత్ర సృష్టించిందన్నారు. తుని పట్టణం, కోటనందూరు, తొండంగి మండలాల్లో టీడీపీ మెజార్టీ కైవసం చేసుకుందన్నారు. 1883లో టీడీపీని ప్రజలు ఆదరించారని, గత చరిత్ర మళ్లీ ఇప్పుడు రిపీట్ అవ్వడం అభినందనీయమన్నారు. రెండుసార్లు అధికారానికి దూరం అవడానికి పలు కారణాలు ఉన్నప్పటికీ మళ్లీ టీడీపీకి తుని ప్రజలు పట్టం కట్టారన్నారు. రాష్ట్రంలో జగన్ తుగ్లక్ పాలనలో ప్రజలు విసుగుచెందారని, అందుకే తగిన గుణపాఠం చెప్పారన్నారు. 151 సీట్లు ప్రజలు ఇస్తే ముఖ్యమంత్రిగా జగన్ పాలన చేయలేకపోయారన్నారు. రాష్ట్రాభివృద్ధిని పూర్తిగా విస్మరించారని యనమల విమర్శించారు. సమావేశంలో తుని ఎమ్మెల్యేగా గెలిచిన యనమల దివ్య, టీడీపీ యువ నేత యనమల రాజేష్, సుర్ల లోవరాజు, చింతమనీడి నాగ సోమరాజు (అబ్బాయి), మోతుకూరి వెంకటేష్, ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి సత్యనారాయణ, నార్ల రత్నాజీ తదితరులు ఉన్నారు. టీడీపీ కూటమి భారీ విజయాన్ని పురస్కరించుకుని కార్యకర్తలు పెద్ద ఎత్తున యనమల రామకృష్ణుడు స్వగృహానికి తరలివచ్చారు. యనమలను కలిసిన వారిలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, జిల్లాకు చెందిన పలువురు కీలక నేతలు, కార్యకర్తలు ఉన్నారు.