వాడపల్లి ఆలయంలో ఎస్ఐ దురుసు ప్రవర్తన
ABN , Publish Date - Apr 13 , 2024 | 11:59 PM
సార్వత్రిక ఎన్నికల నియమావళిని బేఖాతరు చేస్తూ ఎస్ఐ శ్రీనివాస్ ఆలయంలో వీరంగం సృష్టించారు. దీంతో ఉప కమిషనర్ భూపతిరాజు కిషోర్కుమార్ జిల్లా ఎస్పీ, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
ఆత్రేయపురం, ఏప్రిల్ 13: సార్వత్రిక ఎన్నికల నియమావళిని బేఖాతరు చేస్తూ ఎస్ఐ శ్రీనివాస్ ఆలయంలో వీరంగం సృష్టించారు. దీంతో ఉప కమిషనర్ భూపతిరాజు కిషోర్కుమార్ జిల్లా ఎస్పీ, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఫిర్యాదులో అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా వెంకన్న ఆలయంలో వీఐపీ దర్శనాలను నిలుపుదల చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ప్రముఖులను తీసుకువెళ్లే గేటుకు తాళం వేసి సీలు వేశారు. శనివారం విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శ్రీనివాస్ వీఐపీ గేటు ద్వారా సీలు తీసివేయించి తాళం తీసి కొంత మంది భక్తులను ఈ గేటు ద్వారా ఆలయంలోకి పంపే ప్రయత్నం చేశారు. ఆలయ జూనియర్ అసిస్టెంట్ రామానుజం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సూపరింటెండెంట్ రాపాక శ్రీనివాసులకు తెలియజేయడంతో వీఐపీ గేటు వద్దకు వచ్చి ఎస్ఐతో మాట్లాడే ప్రయత్నం చేయగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్ పరుష పదజాలంతో తన ప్రతాపాన్ని చూపారు. తన తడాఖా చూపిస్తానంటూ ఆలయ సిబ్బందిపై దుర్భాషలాడారు. ఈ విషయాన్ని ఉప కమిషనర్కు సిబ్బంది వివరించారు. దీంతో ఆయన వీఐపీ గేటు వద్ద సీసీ పుటేజీని పరిశీలించారు. పోలీసులు తమ ఇష్టానుసారంగా వారికి కావాల్సిన వ్యక్తులకు దర్శనాలు అందిస్తున్న వైనంపై సీసీ పుటేజీ ద్వారా పరిశీలించారు. ఈ మేరకు శనివారం ఉప కమిషనర్ ఎస్ఐ, పోలీస్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీలకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.