Share News

వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం

ABN , Publish Date - Mar 08 , 2024 | 12:37 AM

కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం ఖాయమైపోయింది. ఈనెల 14 నుంచి 17వ తేదీ మధ్యలో తాడేపల్లిలో జగన్‌ సమక్షంలో ముద్రగడ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం

కిర్లంపూడి, మార్చి 7: కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం ఖాయమైపోయింది. ఈనెల 14 నుంచి 17వ తేదీ మధ్యలో తాడేపల్లిలో జగన్‌ సమక్షంలో ముద్రగడ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తూ ఎంపీ మిథున్‌రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లారు. ఆయనతో చాలాసేపు చర్చలు జరిపారు. సీఎం జగన్‌తో సూచనల మేరకు పార్టీలోకి ఆహ్వా నించేందుకు వచ్చినట్టు వారంతా వివరించారు. ఈ నేప థ్యంలో జరిగిన చర్చల అనంతరం వైసీపీలో చేరేందుకు ముద్రగడ అంగీకరించారు. అయితే తేదీ ఏదనేది అధికారికంగా వైసీసీ, ముద్రగడ వర్గం ధ్రువీకరించాల్సి ఉంది. భవిష్యత్తులో రాజ్యసభ, ప్రస్తుతానికి ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేలోపు ముద్రగడ తనయుడికి కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చేలా గురువారం చర్చలు జరిగినట్టు తెలిసింది. ముద్రగడతో భేటీ అనంతరం ఎంపీ మిధున్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముద్రగడను సీఎం జగన్‌ వైసీపీలోకి ఆహ్వానించారని, అందుకే తాము వచ్చినట్టు చెప్పారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఆయన మంచి నిర్ణయం ప్రకటిస్తున్నారని ఆశిస్తున్నామన్నారు. ముద్రగడకు ఏ ఆఫర్‌ ఇవ్వలేదన్నారు. ముద్రగడ పార్టీలోకి వస్తే జగన్‌ ఆయనకు సముచిత స్థానం కల్పిస్తారని చెప్పారు. మిథున్‌రెడ్డి వెంట కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత, వైసీపీ జగ్గంపేట, పెద్దాపురం ఇన్‌చార్జిలు తోట నరసింహం, దవులూరి దొరబాబు, వైసీపీ నాయకుడు జక్కంపూడి గణేష్‌ ఉన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 12:37 AM