యోగాతో నాడీ రుగ్మతలను అధిగమించాలి
ABN , Publish Date - Jul 21 , 2024 | 12:14 AM
నేటి ఒత్తిళ్లతో కూడిన సమాజంలో నరాలు, నాడీ సంబంధ రుగ్మతల బారినుంచి ప్రజలకు నివారణ కల్పించేందుకు యోగా, మెడిటేషన్ వంటివి ఎంతగానో తోడ్పతాయని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు.
గుంటూరు (మెడికల్), జూలై 20: నేటి ఒత్తిళ్లతో కూడిన సమాజంలో నరాలు, నాడీ సంబంధ రుగ్మతల బారినుంచి ప్రజలకు నివారణ కల్పించేందుకు యోగా, మెడిటేషన్ వంటివి ఎంతగానో తోడ్పతాయని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. శనివారం ఇన్నర్ రింగ్రోడ్లోని శ్రీకన్వెన్షన్లో ఆంధ్రప్రదేశ్ న్యూరో సైంటిస్ట్స్ అసోసియేషన్ (ఏపీ ఎన్ఎస్ఏ) 31వ వార్షిక సదస్సు ఏపీ న్యూరోకాన్ 2024లో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. తొలుత ఎమ్మెల్యే నసీర్ అహ్మద్తో పాటు ఏపీ ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ పీ విజయ తదితరులు జ్యోతి ప్రజ్వనలతో సదస్సును ప్రారంభించారు. పీజీఐ, చంఢీఘర్ డైరెక్టర్, న్యూరో ఆప్తమాలజిస్ట్ డాక్టర్ వివేక్లాల్ మాట్లాడుతూ కృత్రిమ మేఽథ వంటి ఆధునిక సాకేంతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా రోగుల వైద్యచికిత్సల్లో వైద్యుడు తన మేధస్సును వాడాలని, కేవలం యాంత్రికంగా వైద్య పరిజ్ఞానంపై ఆధారపడటం తగదని సూచించారు. సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ బాబ్జీ శ్యామ్కుమార్ మాట్లాడుతూ ఈ సదస్సులో సీనియర్ వైద్యులు తమ అనుభవం రంగరించి చేసే ప్రసంగాలు, కేసు స్టడీలు యువవైద్యులకు ఎంతగానో తోడ్పడతాయన్నారు. కార్యక్రమంలో ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దేభాశిష్చౌదరి, ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నిర్మల్ సూర్య, డాక్టర్ మానస్ పాణిగ్రాహి, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ వీఆర్ తారక్నాఽథ్, సెక్రటరీ డాక్టర్ నూతక్కి శ్రీనివాసరావు, సైంటిఫిక్ కమిటీ చైర్మన్ ఎన్వీ సుందరాచారి తదితరులు ప్రసంగించారు. అనంతరం సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ జాగర్లమూడి మురళీకృష్ణ శర్మ, న్యూరోసర్జన్ డాక్టర్ బీ దిబ్బల్రావులకు జీవిత సాఫల్య అవార్డులు అందజేశారు. దిబ్బల్రావు సభకు రాలేకపోవడంతో ఆయన తరపున ప్రొఫెసర్ మల్లేశ్వరరావు అవార్డు అందుకున్నారు. అనంతరం జరిగిన సైంటిఫిక్ సెషన్లో పలువురు ప్రముఖ వైద్యులు వివిధ అంశాలపై ప్రసంగించారు. మెడికల్ పీజీ విద్యార్థులకు పోస్టర్ ప్రజంటేషన్ నిర్వహించారు. ఆదివారం కూడా సదస్సు కొనసాగుతుంది.