Share News

AP News: పెళ్లి వద్దన్న యువతి.. యువకుడు ఏం చేశాడంటే..?

ABN , Publish Date - May 31 , 2024 | 03:56 AM

డిగ్రీ చేసి.. పని, పాటా లేని యువకుడు తన క్లాస్ మేట్ అయిన యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుందామని ఆ యువతితో చెబితే తిరస్కరించింది. ఆ విషయం మనసులో పెట్టుకున్న యువకుడు యువతిని దారుణంగా హతమార్చాడు. తర్వాత ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

AP News: పెళ్లి వద్దన్న యువతి.. యువకుడు ఏం చేశాడంటే..?
Girl Attacked

ఏలూరులో దళిత యువతి దారుణ హత్య.

16న పెళ్లి పీటలెక్కాల్సిన యువతి, అంతలోనే విషాదాంతం

నడిరోడ్డుపై పట్టపగలు క్లాస్‌మేట్‌ ఘాతుకం..

ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

విజయవాడలో వెంటిలేటర్‌పై చికిత్స..

నిందితుడిపై హత్య, అట్రాసిటీ కేసులు


ఏలూరు క్రైం, మే 30: డిగ్రీ చదివిన ఆ యువకుడు పనీపాట లేకుండా ఖాళీగా ఉన్నాడు. డిగ్రీలో అతడి క్లాస్‌మేట్‌ అయిన యువతి ప్రస్తుతం ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తోంది. ఆమెను పెళ్లి చేసుకుంటే జీవితంలో అన్ని సమకూరుతాయని ప్రేమ, పెళ్లి అంటూ వెంటపడ్డాడు. ఆమె నిరాకరించడంతో దళిత యువతి అని లోకువ కట్టి పదేపదే వేధించసాగాడు. ఈ క్రమంలో ఈనెల 26వ తేదీన ఆ యువతికి నిశ్చితార్థం జరిగింది. ఇది తెలిసి ముందస్తు ప్లాన్‌ ప్రకారం నడిరోడ్డుపై యువతిని కత్తితో నరికి హతమార్చాడు. ఆపై తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. జిల్లా కేంద్రమైన ఏలూరులోని సత్రంపాడులో గురువారం మధ్యాహ్నం ఈ దారుణం చేటుచేసుకుంది.


లెక్చరర్‌గా విధులు

పోలీసుల కథనం మేరకు.. సత్రంపాడు ఎంఆర్‌సీ కాలనీకి చెందిన జక్కుల రామారావు రిటైర్డు ఉద్యోగి. ఆయన రెండవ భార్య కుమార్తె జక్కుల రత్న గ్రేస్‌ అలియాస్‌ స్వీటీ(23) బీఎస్సీ కంప్యూటర్స్‌ చదివింది. ప్రస్తుతం సత్రంపాడులోని ఒక ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తోంది. డిగ్రీలో తన క్లాస్‌మేట్‌ అయిన ముసునూరుకు చెందిన తట్టుబోయిన ఏసురత్నం (23)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత ఆ యువకుడు.. ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వెంటపడేవాడు. కులాలు వేరుకావడంతో తమ ఇంట్లో ఒప్పుకోరని, వారి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోలేనని ఆమె సున్నితంగా తిరస్కరించింది.


పేరంట్స్‌కు చెప్పిన యువతి

అయినప్పటికీ వెంటపడుతుండడంతో తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు ఏసురత్నం తల్లి దండ్రులను పిలిపించి విషయం చెప్పి మందలించారు. ఈ క్రమంలోనే స్వీటీకి వేరే యువకుడితో ఈ నెల 26న నిశ్చితార్థం జరిగింది. స్వీటీ యఽథావిధిగా గురువారం తను పనిచేసే కాలేజీకి వెళ్లింది. మధ్యాహ్నం పెళ్లి అవసరాలకు డబ్బులు తీసే నిమిత్తం కాలేజీ క్యాంప్‌సలో ఉన్న బ్యాంక్‌ లోపలకు వెళ్లింది. అప్పటికే ఆ బ్యాంకులో మాటు వేసి ఉన్న ఏసురత్నం ‘నీతో మాట్లాడే పని ఉంద’ని సమీపంలోని బ్రాహ్మణ వీధిలోకి తీసుకువెళ్లాడు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ముందస్తు ప్లాన్‌ ప్రకారం.. ఒక్కసారిగా ఆమె జుత్తు పట్టుకుని వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేయడంతో స్వీటీ మెడపై, తలపై, గొంతుపై, శరీరంపై నరకడంతో అక్కడికక్కడే మృతి చెందింది.


గొంతు కోసుకుని సూసైడ్ అటెంప్ట్

తర్వాత ఆ ఉన్మాది కత్తితో తన గొంతు కోసుకుని ఆమె పక్కనే రక్తపు మడుగులో పడిపోయాడు. సమాచారం అందుకున్న త్రీటౌన్‌ సీఐ కె.శ్రీనివాసరావు హుటాహుటిన చేరుకుని ఇద్దరినీ ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి స్వీటీ అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. ఏసురత్నం పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో విజయవాడ తరలించారు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. త్రీటౌన్‌ పోలీసులు ఏసురత్నంపై హత్య, అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


పెళ్లి జరగాల్సిన ఇంట విషాదం

స్వీటీకి వచ్చే నెల 15వ తేదీన ప్రదానం, 16వ తేదీన వివాహం జరగనుండగా అంతా పెళ్లి పనుల హడావుడిలో ఉన్నారు. డబ్బులు డ్రా చేసి తీసుకువస్తానని చెప్పి వెళ్లిన తమ కుమార్తె హత్యకు గురైందని తెలియడంతో తల్లి రాజ్యలక్ష్మి కుప్పకూలిపోయింది. తండ్రి రామారావు తీవ్రంగా తల్లడిల్లిపోయాడు. వారితో పాటు బంధువులు ఆస్పత్రికి చేరుకుని రత్నగ్రేస్‌ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. హంతకుడిని, అతడిని ప్రోత్సహించిన కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలంటూ వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - May 31 , 2024 | 12:21 PM