Share News

Idupulapaya IIIT: మరోసారి వార్తల్లో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ.. విద్యార్థిని ఆత్మహత్య

ABN , Publish Date - Aug 07 , 2024 | 10:16 AM

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ క్యాంపస్‌లో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాత్రూంలో వాటర్ లైన్ పైపునకు చున్నీతోఉరి వేసుకుని సెకండ్ ఇయర్ చదువుతున్న జమీషా ఖురేషి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

Idupulapaya IIIT: మరోసారి వార్తల్లో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ.. విద్యార్థిని ఆత్మహత్య

కడప: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ క్యాంపస్‌లో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాత్రూంలో వాటర్ లైన్ పైపునకు చున్నీతోఉరి వేసుకుని సెకండ్ ఇయర్ చదువుతున్న జమీషా ఖురేషి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన జమీషా ఖురేషిగా గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న సాయంత్రం ఫైనల్ ఇయర్‌కు చెందిన ఓ విద్యార్థిని మొబైల్ ఫోన్ క్యాంటీన్ వద్ద మిస్ అయ్యింది. మిస్ అయిన మొబైల్ ఫోన్‌ను మృతురాలు జమీషా ఖురేషి తీసుకున్న విషయాన్ని గుర్తించి ట్రిబుల్ ఐటీ అధికారులు మందలించారు. దీంతో మనస్థాపం చెందిన జమీషా ఖురేషి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.


వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ గతంలోనూ పలుమార్లు వార్తల్లో నిలిచింది. ఇటీవల ఆ కళాశాలలో గంజాయి కలకలం రేపింది. ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థుల వద్ద భద్రతా సిబ్బంది గంజాయి, సిగరెట్‌ ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడంతో ఒక్కసారిగా కాలేజ్ వార్తల్లో నిలిచింది. అన్నమయ్య జిల్లా గాలివీడు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతానికి చెందిన విద్యార్థులు కడపకు వెళ్లి తిరిగి రాగా... వారిని భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. వారి వద్ద గంజాయి, సిగరెట్‌ ప్యాకెట్లు పట్టుబడ్డాయి. ఈ వార్త అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.


కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సైతం అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి కలకలంపై సమగ్ర విచారణ జరపాలని అధికారులకు ఆదేశించారు. గంజాయిని ప్రోత్సహించే వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అప్పట్లో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం నారా లోకేష్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సమగ్ర విచారణ జరిపి, గంజాయిని ప్రోత్సహించే స్థానిక రాజకీయ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. విద్యాలయాల ప్రాంగణంలో గంజాయి ఆనవాళ్లు లేకుండా నిర్మూలిస్తామని తల్లిదండ్రులకు లోకేష్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ఇప్పటికే తమ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని లోకేష్ తెలిపారు. పులివెందులలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ మంత్రి నారా లోకేష్‌ను విద్యార్థుల తల్లిదండ్రులు కలిశారు.

Updated Date - Aug 07 , 2024 | 10:34 AM