Share News

సర్టిఫికెట్ల తిరస్కరణపై సబ్‌కలెక్టర్‌ విచారణ

ABN , Publish Date - Aug 28 , 2024 | 11:38 PM

మదనపల్లె మండలంలో ఐదు నెలల్లో వివిధ సర్టిఫికెట్ల కోసం చేసిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులు తిరస్కరించడంపై సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌ సుమోటోగా విచారణ చేపట్టారు.

సర్టిఫికెట్ల తిరస్కరణపై సబ్‌కలెక్టర్‌ విచారణ
పోతబోలులో సర్టిఫికెట్ల తిరస్కరణపై విచారిస్తున్న సబ్‌ కలెక్టర్‌ మేఘస్వరూప్‌

మదనపల్లె టౌన్‌, ఆగస్టు 28: మదనపల్లె మండలంలో ఐదు నెలల్లో వివిధ సర్టిఫికెట్ల కోసం చేసిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులు తిరస్కరించడంపై సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌ సుమోటోగా విచారణ చేపట్టారు. మదనపల్లె మండలంలో ఐదు నెలల కాలంలో ప్రజలు అన్ని రకాల సర్టిఫికెట్లు (కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు) కోసం 21 వేల మంది దరఖాస్తు చేసుకోగా వీటిలో 6 వేల దరఖాస్తులను వివిధ కారణాలతో రెవెన్యూ అధికారులు తిరస్కరించారు. ఈ క్రమంలో వీటిపై సుమోటోగా స్వీకరించిన సబ్‌కలెక్టర్‌ బుధవారం మండలంలోని పోతబోలు, కొత్తవారిపల్లె గ్రామాల పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న కొందరిని విచారించడంతో పాటు గ్రామ సచివాలయాల్లో రిజిస్టర్లను పరిశీలించారు. ఏ కారణాలతో ఇంత పెద్ద మొత్తంలో సర్టిఫికెట్లను తిరస్కరించారో వీఆర్‌వో, ఆర్‌ఐ, తహసీల్దార్‌లను వివరణ అడిగారు. అధికారులు మాట్లాడుతూ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న కొందరు చనిపోయారని, కొందరి డేటా సరిగ్గా లేదని, మరికొందరు గ్రామాల్లో లేరని సబ్‌కలెక్టర్‌కు వివరించారు. దీనిపై సమగ్రంగా విచారించి నివేదికలు పంపాలని తహసీల్దార్‌ ఖాజాబీని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రెడ్డెప్ప, వీఆర్‌వోలు ప్రసాద్‌, విశ్వనాథ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 28 , 2024 | 11:38 PM