కోర్టు ఆవరణలో వృద్ధ రైతు ఆత్మహత్య
ABN , Publish Date - Mar 16 , 2024 | 12:35 AM
తన కుటుంబానికి న్యాయం జరగాలని వృద్ధ రైతు కోర్టు ఆవరణలో ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా సంచలనం కలిగించింది.
నందిగామ, మార్చి 15 : తన కుటుంబానికి న్యాయం జరగాలని వృద్ధ రైతు కోర్టు ఆవరణలో ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా సంచలనం కలిగించింది. సేకరించిన సమాచారం ప్రకారం.. కంచికచర్ల మండలం మోగులూరు గ్రామానికి చెందిన కూచు వెంకటేశ్వరరావు(80)కి గ్రామంలో సుమారు ఎకరం భూమి ఉంది. ఆ భూమిని తన సోదరుడి కుమారుడు పోర్జరీ సంతకంతో అక్రమ రిజిస్టేషన్ చేయించుకున్నాడని ఆరోపిస్తూ ఆరేళ్ల క్రితం కోర్టును ఆశ్రయించాడు. అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతున్న క్రమంలో శుక్రవారం ఉదయం కోర్టుకు వచ్చిన వెంకటేశ్వరవు పురుగుమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందుగానే లేఖను ఇతరులతో రాయించి జేబులో పెట్టుకున్నాడు. తన తమ్ముడి కుమారుడు తన భూమిని అక్రమంగా పొందాడని, దీనిపై నిలదీస్తే కుమార్తెలపై కేసులు పెట్టిస్తున్నాడని ఆరోపించాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కష్టాన్ని తట్టుకోలేకపోతున్నట్టు లేఖలో రాసి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.