Share News

మదర్సాలో మిస్టరీ..!

ABN , Publish Date - Jun 29 , 2024 | 01:04 AM

అజిత్‌సింగ్‌నగర్‌లోని మదర్సాలో విద్యార్థిని మృతి వెనుక అసలు కారణమేంటి? నిజంగానే ఇక్కడ ఫుడ్‌ పాయిజన్‌ అయ్యిందా? జరిగిన ఘటన ఒకటైతే, మదర్సా నిర్వాహకులు ఫుడ్‌ పాయిజన్‌ అంశాన్ని తెరపైకి తెచ్చారా? ఫుడ్‌ పాయిజన్‌ అయిన మిగతా విద్యార్థినులను ఆసుపత్రిలో చేర్పించకుండా ఎందుకు తీసుకెళ్లిపోయారు? ఈ మదర్సాలో ఉంటున్న గుడివాడకు చెందిన కరిష్మా మృతి వెనుక ఇలాంటి ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. నిర్వాహకులే ఏదో చేశారని కరిష్మా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

మదర్సాలో మిస్టరీ..!
కరిష్మా (ఫైల్‌)

  • విద్యార్థినులకు ఫుడ్‌ పాయిజన్‌ అంటున్న నిర్వాహకులు

  • ఆసుపత్రిలో చేర్పించకుండా హడావిడిగా వెనక్కి..

  • ఫుడ్‌ పాయిజన్‌ కాదని తేల్చేసిన అధికారులు

  • మదర్సాలోని ఫ్రిజ్‌లో 100 కేజీల కుళ్లిన మాంసం

  • నిర్వాహకులే ఏదో చేశారంటున్న మృతురాలి బంధువులు

  • పోస్టుమార్టం నివేదికలో బయటపడనున్న నిజాలు

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : నిస్వాన్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సయ్యద్‌ షాహిద్‌ పర్వీజ్‌ అనే వ్యక్తి అజిత్‌సింగ్‌నగర్‌లో మదర్సాను నిర్వహిస్తున్నాడు. ఇక్కడ మొత్తం 60 మంది విద్యార్థినులు ఉండగా, ఎనిమిది మందికి ఫుడ్‌ పాయిజన్‌ అయిందని నిర్వాహకులు చెబుతున్నారు. వారిలో కరిష్మాను శుక్రవారం ఉదయం నగరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించేసరికి ప్రాణాలు కోల్పోయింది.

నిర్వాహకుల మాటొకటి.. అధికారుల మాటొకటి

ఎనిమిది మంది బాలికలకు గురువారం రాత్రి ఫుడ్‌ పాయిజన్‌ అయిందని నిర్వాహకులు చెబుతున్నారు. కానీ, మదర్సాను పరిశీలించి, ఆసుపత్రిలో బాలికలను పరామర్శించిన అధికారులు మాత్రం అటువంటి దాఖలాలు లేవంటున్నారు. ఎనిమిది మందికి ఫుడ్‌ పాయిజన్‌ అయితే, మిగిలిన ఏడుగురిని నిర్వాహకులు ఆసుపత్రిలో చేర్పించలేదు. పరిశీలనలో ఉంచాలని అధికారులు చెప్పినా ప్రభుత్వాసుపత్రిలో ఓపీ చీటీ తీసుకోకుండా తీసుకెళ్లిపోవడం అనుమానాలకు తావిస్తోంది. బాలికలకు వాంతులయ్యాయని నిర్వాహకులు చెబుతున్నారు. అధికారులు ఆరా తీస్తే.. ఈనెల 26న మాత్రమే వాంతులయ్యాయని తేలింది.

కుళ్లిన మాంసం ఎందుకు ఉంచినట్టు?

ఏకంగా 100 కిలోల బీఫ్‌, మటన్‌ మాంసం మదర్సాలోని ఫ్రిజ్‌లో కనిపించింది. ఈ మాంసమంతా కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. ఫ్రిజ్‌ తలుపు తీయగా, ఇది బయటపడింది. ఫుడ్‌ పాయిజన్‌ జరిగిందని సమాచారం రావడంతో ఫుడ్‌సేఫ్టీ అధికారి గౌస్‌.. మదర్సాను తనిఖీ చేశారు. ఫ్రిజ్‌లో ఉన్న మాంసం రాక్‌ ఐస్‌గా మారిపోయిందని అధికారులు చెప్పారు. గునపంతో దీన్ని పగలకొట్టాల్సి వచ్చిందన్నారు. ఈ మాంసం బక్రీద్‌ సందర్భంగా విరాళంగా ఇచ్చినట్టు నిర్వాహకులు అధికారులకు వివరించారు. అసలు కుళ్లిపోయిన మాంసాన్ని ఫ్రిజ్‌లో ఎందుకు భద్రపరిచారన్న దానికి మాత్రం సమాధానం చెప్పలేదు. ఈ మాంసం నమూనాలను ప్రయోగశాలకు పంపారు. కాగా, ఘటన జరిగిన మదర్సాను సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పరిశీలించారు.

నా బిడ్డను ఏదో చేశారు.. మస్తాన్‌ బీ, కరిష్మా తల్లి

‘కరిష్మాను ఏడాది క్రితం మదర్సాలో చేర్పించాను. రంజాన్‌ పండుగకు ఇంటికొచ్చింది. పండుగ అయ్యాక తిరిగి మదర్సాలో అప్పగించాం. కరిష్మాను చూద్దామని కొద్దిరోజుల క్రితం వచ్చాను. ఇంటి నుంచి తీసుకొచ్చి ఇంకా నెల పూర్తికాలేదని చూపించలేదు. ఆమెకు ఇద్దామని కొత్త దుస్తులు కుట్టించాం. మా కుమార్తెకు ఇప్పటి వరకు ఎప్పుడూ జ్వరం కూడా రాలేదు. పూర్తి ఆరోగ్యంగా ఉంటుంది. ఉదయం ఫోన్‌చేసి కరిష్మాకు ఆరోగ్యం బాగోలేదని చెప్పారు. మేము వచ్చేసరికి చనిపోయింది. మదర్సాలో ఏదో జరిగింది. అసలు అక్కడ ఏం జరిగిందో తెలియాలి.’

Updated Date - Jun 29 , 2024 | 01:05 AM