పది పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
ABN , Publish Date - Mar 16 , 2024 | 12:24 AM
ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్టు కలెక్టర్ దిల్లీరావు తెలిపారు. మాల్ ప్రాక్టీసింగ్, మాస్ కాపీయింగ్, పేపర్ లీకేజీకి ఆస్కారం లేకుండా సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు.
విజయవాడ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్టు కలెక్టర్ దిల్లీరావు తెలిపారు. మాల్ ప్రాక్టీసింగ్, మాస్ కాపీయింగ్, పేపర్ లీకేజీకి ఆస్కారం లేకుండా సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిల్లీరావు మాట్లాడుతూ, ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా బాలురు (17414), బాలికలు (15593) మొత్తం 33007మంది పరీక్షలు రాయనున్నారన్నారు. జిల్లావ్యాప్తంగా 178 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు, ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్ష సమయం ఉంటుందన్నారు. ఫిజికల్ సైన్స్, బయాలజీ సైన్స్ పరీక్షలకు సమయాలు మారతాయని చెప్పారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఉదయం 9 గంటలకు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. 9.15 గంటలకు మెయిన్ గేట్ మూసేస్తారని తెలిపారు. విద్యార్థులు హాల్ టిక్కెట్లను వెంట తీసుకుని రావాల్సి ఉంటుందని, ఎస్ఎ్ససీ బోర్డు వెబ్సైట్లో విద్యార్థి పుట్టిన తేదీ ఎంటర్ చేసి హాల్ టిక్కెట్ను తిరిగి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. మొబైల్ ఫోన్స్కు, స్మార్ట్ వాచ్లు, బ్లూటూత్ ఆధారంగా పనిచేసే ఎలాంటి డివైజె్సను అనుమతించటం జరగదన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల సౌకార్యర్థం అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. మాల్ ప్రాక్టీసింగ్, మాస్ కాపీయింగ్ పాల్పడితే కఠన చర్యలు ఉంటాయన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రశ్నాపత్రంపై క్యూఆర్ కోడ్ ఉంటుందని, లీకైతే సెంటర్లో లీకైందో కూడా తెలిసిపోతుందని, వెంటనే బాధ్యులైన వారిని అరెస్టు చేయటం జరుగుతుందన్నారు. ఇన్విజిలేటర్లకు ఫోన్లను అనుమతించటం లేదని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 12 మంది రూట్ ఆఫీసర్లు పర్యవేక్షణ జరుపుతారని చెప్పారు. జిల్లావ్యాప్తంగా మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎస్ఎ్ససీ, ఇంటర్మీడియట్ ఓపెన్ పరీక్షలు జరుగుతాయన్నారు. ఎస్ఎ్ససీ ఓపెన్ విద్యార్థుల కోసం 10 పరీక్షా కేంద్రాలు, ఇంటర్మీడియట్ ఓపెన్ రాసేవారికి 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎస్ఎ్ససీ ఓపెన్ పరీక్షలకు 1785మంది, ఇంటర్ ఓపెన్ పరీక్షలకు 3710 మంది మొత్తంగా 5495 మంది పరీక్షలు రాస్తారని చెప్పారు. పరీక్షలపై విద్యార్థులు, తల్లిదండ్రులు కంట్రోల్ రూమ్ నెంబర్ 9154473676కు ఫోన్చేసి సహాయాన్ని పొందవచ్చునని చెప్పారు. సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా డీఈవో యూవీ సుబ్బారావు, ఏడీ కేఎన్వీ కుమార్లు పాల్గొన్నారు.