నీడ లేక అల్లాడిపోయారు
ABN , Publish Date - Feb 17 , 2024 | 01:39 AM
‘‘మండుటెండలో మగ్గిపోతున్నాం. నిలువ నీడ లేదు. కూర్చునేందుకు కుర్చీలు లేవు. తాగేందుకు మంచినీరు లేదు. ఎందుకు పిలిచారు మమ్మల్ని?’’ అంటూ బుక్కీపర్లకు డ్వాక్రా మహిళలు ప్రశ్నించారు. మైలవరం పట్టణం లోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం అధికార పార్టీ నాయకులు ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
మైలవరంలో ఆసరా చెక్కుల పంపిణీలో డ్వాక్రా మహిళల అవస్థలు
ఎండకు తాళలేక సభ నుంచి వెళ్లిపోతుంటే బుక్కీపర్ల బెదిరింపులు
ఆసరా డబ్బులు ఎలా పడతాయో చూస్తామని హెచ్చరిక
మైలవరం, ఫిబ్రవరి 16: ‘‘మండుటెండలో మగ్గిపోతున్నాం. నిలువ నీడ లేదు. కూర్చునేందుకు కుర్చీలు లేవు. తాగేందుకు మంచినీరు లేదు. ఎందుకు పిలిచారు మమ్మల్ని?’’ అంటూ బుక్కీపర్లకు డ్వాక్రా మహిళలు ప్రశ్నించారు. మైలవరం పట్టణం లోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం అధికార పార్టీ నాయకులు ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సభకు రాకుంటే డ్వాక్రా రుణ మాఫీ డబ్బులు పడవు అని చెప్పి బుక్ కీపర్లు డ్వాక్రా మహిళలను బెదరించి సభకు రప్పించారు కానీ వారు కూర్చోవడానికి కుర్చీలు, సరిపడినన్ని టెంట్లు, తాగునీరు ఏర్పాటు చేయలేదు. మధ్యాహ్నం 12 గంటలకు అని చెప్పిన చెక్కుల పంపిణీ రెండు గంటల ఆలస్యంగా మొదలైంది. దీంతో ఎండకు తట్టుకోలేక మహిళలు దాహంతో అల్లాడారు. దీంతో వెనుతిరిగి వెళ్లిపోతున్న మహిళలను బుక్ కీపర్లు నిలువరించారు. వెళ్లిపోతున్న వారి వీడియోలు తీశారు. మీకు డబ్బులు ఎలా పడతాయో చూస్తా మంటూ బెదిరించారు. అయినా బెదరక చాలా మంది మహిళలు వెనుతిరిగి వెళ్లిపో యారు. ఇక సభా వేదికపై అధికారులు సైతం జగన్ జై అంటూ స్వామిభక్తిని చాటుకో వడం చర్చనీయాంశమయ్యింది.