విజయవాడ పశ్చిమలో జనసేన బలంగా ఉంది
ABN , Publish Date - Mar 16 , 2024 | 12:38 AM
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలంగా ఉండబట్టే వైసీపీ నాయకులు అభ్యర్థిని మార్చారని జనసేన అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన మహేశ్ అన్నారు. శుక్రవారం వన్టౌన్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
వన్టౌన్, మార్చి 15 : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలంగా ఉండబట్టే వైసీపీ నాయకులు అభ్యర్థిని మార్చారని జనసేన అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన మహేశ్ అన్నారు. శుక్రవారం వన్టౌన్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గంలో జనసేన క్యాడర్ బలంగా ఉందని, ప్రతి పోరాటం విజయవాడ వేదికగా జరిగిందని తెలిపారు. అందుకే వైసీపీ అభ్యర్థిని మరోచోటికి మార్చడం జరిగిందన్నారు. పిఠాపురంలో పవన్కల్యాణ్ను గెలిపించాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తీరుతామన్నారు.
పశ్చిమ సీటు మహేశ్కు ఇవ్వాలి : నగరాల ఐక్యవేదిక నేతలు
విజయవాడ పశ్చిమ సీటు పోతిన మహేశ్కు ఇవ్వాలని నగరాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం నగరాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చిట్టినగర్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. కొత్తపేట పార్టీ కార్యాలయం నుంచి చిట్టినగర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. సర్ధార్ మరుపిళ్ల చిట్టి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఐక్యవేదిక గౌరవ అధ్యక్షుడు రాంపిళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రజాసమస్యల పరిష్కారానికి అహర్నిశలు పోరాడిన పోతిన మహేశ్కు పశ్చిమ సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కమిటీ అఽధ్యక్షుడు లింగిపిల్లి అప్పారావు, రాష్ట్ర ఐక్యవేదిక నాయకులు రాయన ఆదిబాబు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గ సీటు పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయిస్తున్నారని విస్త్రృత ప్రచారంతో జనసేన సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందోళన చెందారు. ఈ క్రమంలో శుక్రవారం మహిళా నేతలు పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయానికి చేరుకుని కంటతడి పెట్టారు. పోతిన మహేశ్కు పశ్చిమ సీటు ఇవ్వకపోవడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ పునరాలోచన చేయాలని కోరారు.