కృష్ణా యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేశా
ABN , Publish Date - Jun 30 , 2024 | 01:17 AM
కృష్ణా యూనివర్సిటీ వీసీగా తాను పనిచేసిన ఏడాదిలో యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులు చేసినట్టు వీసీ జి.జ్ఞానమణి తెలిపారు.
ప్రభుత్వం రాజీనామా ఆమోదించేంత వరకు వీసీగా కొనసాగుతా: జి.జ్ఞానమణి
మచిలీపట్నం, జూన్ 29(ఆంధ్రజ్యోతి): కృష్ణా యూనివర్సిటీ వీసీగా తాను పనిచేసిన ఏడాదిలో యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులు చేసినట్టు వీసీ జి.జ్ఞానమణి తెలిపారు. యూనివర్సిటీ సెనెట్హాలులో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను వీసీ పదవికి రాజీనామా చేశానని, రాజీనామాను ప్రభుత్వం ఆమోదించాల్సి ఉందని, అప్పటివరకు వీసీగా కొనసాగుతానని ఆయన తెలిపారు. యూనివర్సిటీ ప్రాంగణంలో, నూజివీడు పీజీ సెంటరులో భవనాల నిర్మాణానికి ఈ ఏడాదికాలంగా కృషి చేశానని తెలిపారు. యూనివర్సిటీలో ఫార్మసీ కళాశాల భవనాలు, యూనివర్సిటీ ప్రాంగణం చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టామని, ఈ పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాదిలో యూనివర్సిటీ ద్వారా క్యాంపస్ సెలక్షన్లు నిర్వహించి 250మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. అమెరికాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాల యంతో ఒప్పందం కుదుర్చుకుని ఐదుగురు విద్యార్థులకు విదేశాల్లో ఉన్నతవిద్య చదివేందుకు అవకాశం కల్పించామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో యూనివర్సిటీలో కొన్ని అభివృద్ధి పనులు ప్రారంభించలేకపోయామన్నారు. వచ్చే జూలైలో యూనివర్సిటీ స్నాతకోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించామన్నారు. సమావేశంలో రిజిస్ర్టార్ కె.శోభన్బాబు, వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.