‘నంద్యాల రైల్వే స్టేషన్ సమగ్రాభివృద్ధే లక్ష్యం’
ABN , Publish Date - Jul 19 , 2024 | 11:50 PM
నంద్యాలలోని రైల్వే స్టేషన్ సమగ్రాభివృద్దే తమ లక్ష్యమని గుంటూరు రైల్వే డివిజన్ ఏడీఆర్ఎం సైమన్ అన్నారు.
నంద్యాల (నూనెపల్లె), జూలై 19: నంద్యాలలోని రైల్వే స్టేషన్ సమగ్రాభివృద్దే తమ లక్ష్యమని గుంటూరు రైల్వే డివిజన్ ఏడీఆర్ఎం సైమన్ అన్నారు. దేశంలోనే ఎంపికైన మోడల్ స్టేషన్లలో నంద్యాల రైల్వే స్టేషన్ ఒకటిగా ఉండటంతో స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు ఏడీఆర్ఎం సైమన్ డివిజనల్ రైల్వే అధికారులు శుక్రవారం నంద్యాల రైల్వే స్టేషన్కు వచ్చారు. స్టేషన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.
గుంటూరు రైల్వే డివిజన్ ఏడీఆర్ఎం సైమన్ నంద్యాలకు రావడంతో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ శుక్రవారం రైల్వే స్టేషన్లో ఏడీఆర్ఎంను కలిశారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులపై చర్చించారు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి విజ్ఞప్తి మేరకు నంద్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల్లో భాగంగా 30 అడుగుల రోడ్డును 40 అడుగులు చేయాలని ఫిరోజ్ ఏడీఆర్ఎంను కోరారు. రైల్వే స్టేషన్ ఆవరణలో పార్కింగ్ రైల్వే ట్రాక్ తదితర సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ కౌన్సిలర్లు శివశంకర్యాదవ్, కృపాకర్, అజ్మీర్ విశ్వనాథరెడ్డి తదితరులు ఉన్నారు.
గూడ్స్ షెడ్ కార్మికులకు ఇబ్బందులు లేకుండా సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు మహ్మద్గౌస్, లక్ష్మణ్ ఏడీఆర్ఎం సైమన్ కు వినతి పత్రం అందజేశారు.