బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించాలి
ABN , Publish Date - Apr 30 , 2024 | 12:15 AM
సార్వత్రిక ఎన్నికల విధులను బాధ్యతగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె. శ్రీనివాసులు, ఎన్నికల పరిశీలకులు దినేష్ కుమార్, పంకజ్కుమార్, హిమాన్షు శంకర్ త్రివేది ఆదేశించారు.
ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలపై ఉన్నతాధికారుల సూచన
నంద్యాల (కల్చరల్), ఏప్రిల్ 29: సార్వత్రిక ఎన్నికల విధులను బాధ్యతగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె. శ్రీనివాసులు, ఎన్నికల పరిశీలకులు దినేష్ కుమార్, పంకజ్కుమార్, హిమాన్షు శంకర్ త్రివేది ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించడంపై నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం, పార్లమెంట్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు, 16 కమిటీల నోడల్ అధికారులు, సబ్ డివిజనల్ పోలీసు అధికారులతో కలెక్టర్, ఎస్పీ, ఎన్నికల పరిశీలకుల బృందం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమర్ధవంతంగా పోలింగ్ నిర్వహణపై ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు మే6, 7తేదీలలో మరోసారి పూర్తి స్ధాయి శిక్షణ ఇవ్వాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు సమకూర్చాలని అన్నారు. కౌటింగ్ ప్రక్రియకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.
బ్యాంక్ అకౌంట్ ద్వారా పింఛన్ల పంపిణీ
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో వున్న నేపఽథ్యంలో పింఛన్ పొందుతున్న లబ్ధిదారులకు నేరుగా బ్యాంక్ అకౌంట్ ద్వారా పింఛన్ జమ అవుతుందని కలెక్టర్ .కె. శ్రీనివాసులు సోమవారం తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షనర్లకు డోర్ టు డోర్ పంపిణీ చర్యలు చేపట్టామన్నారు. విభిన్న ప్రతిభావంతులు, మంచానికే పరిమితమైనా వారు, అస్వస్ధత, నడవలేక వీల్చైర్స్లో వున్న వారు, సైనిక సంక్షేమ పింఛను పొందుతున్న వృద్ధ మహిళలకు సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి పింఛన్ ఇస్తారని కలెక్టర్ తెలిపారు