అంతా దోపిడే..
ABN , Publish Date - Mar 01 , 2024 | 11:59 PM
డోన్ నియోజకవర్గంలో మైనింగ్, లిక్కర్, ల్యాండ్, ఇసుక మాఫియాలతో అంతా దోపిడీ చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి, డోన్ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్రమ కేసులతో బుగ్గన బెదిరిస్తున్నాడు
ప్రజల భవిష్యత్తు కోసమే డోన్ నుంచి పోటీ
కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి
డోన్, మార్చి 1: డోన్ నియోజకవర్గంలో మైనింగ్, లిక్కర్, ల్యాండ్, ఇసుక మాఫియాలతో అంతా దోపిడీ చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి, డోన్ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పట్టణంలోని మధు ఫంక్షన్ హాలులో నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి ఆత్మీయ సభలో కోట్ల మాట్లాడారు. తాను కర్నూలు ఎంపీగా మూడు సార్లు, రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఒకసారి పని చేశానన్నారు. డోన్ నియోజకవర్గంలో మంత్రి బుగ్గన అరాచకాలతో ఇబ్బందులు పడుతున్న పార్టీ కార్యకర్తలు, ప్రజలకు అండగా ఉండాలనే ఇక్కడకు వచ్చానని తెలిపారు. మైనింగ్ వనరులు ఎక్కువగా ఉన్నాయని.. పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే తమ లక్ష్యమన్నారు. మంత్రి బుగ్గన చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. బావిపల్లి సర్పంచ్ లింగన్నను టార్గెట్ చేసి వైసీపీలోకి రావాలని, అక్రమ కేసులను బయటకు తీస్తున్నారని, అలాంటి వాటికి ఎవరూ భయపడవద్దని భరోసా ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలంటే టీడీపీని గెలిపించుకొని చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు కోట్ల సుజాతమ్మ, గౌరు చరితారెడ్డి, మీనాక్షి నాయుడు, పత్తికొండ టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు, మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి తిక్కారెడ్డి, కేవీ సుబ్బారెడ్డి, కోట్ల రాఘవేంద్రరెడ్డి, కోట్ల నివేదిక, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు వై.నాగేశ్వరరావు, వలసల రామకృష్ణ, కోట్రికే ఫణిరాజ్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ లక్కసాగరం లక్ష్మీరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ టీఈ కేశన్నగౌడు, ఓబులాపురం శేషిరెడ్డి, లక్ష్మీనారాయణ యాదవ్, చంద్రపలి ఆచారి పాల్గొన్నారు.