నేటి నుంచి ఇంటర్, టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
ABN , Publish Date - May 24 , 2024 | 12:05 AM
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ శుక్రవారం నుంచి జూన్ 1వ తేదీ వరకు జరగనున్నాయి.
కర్నూలు(ఎడ్యుకేషన్), మే 23: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ శుక్రవారం నుంచి జూన్ 1వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్ష కేంద్రాలన్నింటిలో ఇంటర్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇప్పటికే విద్యార్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. ఒక గంట ముందే పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 22,943 మంది నమోదు చేసుకున్నారు. ఇందులో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 15,981 మంది ఉన్నారు. ఇందులో జనరల్ కోర్సుల విద్యార్థులు 15,076 మంది కాగా, ఒకేషనల్ కోర్సు విద్యార్థులు 905 మంది ఉన్నారు. ఈ విద్యార్థుల కోసం 35 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే రెండో సంవత్సరం విద్యార్థులు 6962 మంది కాగా.. ఇందులో జనరల్ కోర్సుల విద్యార్థులు 6194 మంది కాగా, ఒకేషనల్ కోర్సు విద్యార్థులు 768 మంది ఉన్నారు. ఈ విద్యార్థుల కోసం జిల్లాలో 22 పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారులు సిద్ధం చేశారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం జరుగుతాయని, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈఓ శామ్యూల్ గురువారం తెలిపారు. జిల్లాలో 17,458 మంది విద్యార్థులు పదీ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవుతున్నారనీ అన్నారు. ఈ విద్యార్థుల కోసం 69 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు డీఈవో వివరించారు. పరీక్షల నిర్వహణ కోసం 69 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 69 మంది డిపార్టుమెంట్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్స్, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్స్ను ఏర్పాటు చేశామన్నారు. ఏదైనా సమస్యలు వస్తే 9885716544, 9000822394 నెంబర్లను సంప్రదించాలని ఆయన తెలిపారు.