యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - Apr 22 , 2024 | 12:13 AM
మండలంలోని పాతమడుగుల గిరిజన గూడేనికి చెందిన ఐలేని తిక్కస్వామి (25) ఆత్మహత్య చేసుకున్నాడు.
కొత్తపల్లి, ఏప్రిల్ 21: మండలంలోని పాతమడుగుల గిరిజన గూడేనికి చెందిన ఐలేని తిక్కస్వామి (25) ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తపల్లి హెడ్ కానిస్టేబుల్ ఓబులేసు తెలిపిన వివరాలివీ.. తిక్కస్వామి ఉగాది పండుగ రోజున ఖర్చుల నిమిత్తం రూ.2వేలు ఇవ్వాలని తండ్రి హుశేనయ్యను ఒత్తిడి చేశాడు. తన వద్ద డబ్బుల్లేవని, మళ్లీ ఇస్తానని చెప్పారు. అయితే అప్పటి నుంచి మనస్థాపానికి గురైన తిక్కస్వామి తరుచూ తండ్రితో గొడవపడేవాడు. శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు స్థానికుల సాయంతో ఆత్మకూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. అక్కడ కోలుకోలేక మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేందుకు ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో కొత్తపల్లికి చెందిన బీసీ సంఘం నాయకులు నాగేశ్వరరావు యాదవ్, హెడ్ కానిస్టేబుల్ ఓబులేసులు స్టెచ్చర్పై తీసుకెళ్లి పోస్టుమార్టం చేయించారు. యువకుడి తల్లిదండ్రుల దగ్గర కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో వారే ఖర్చుల నిమిత్తం ఇచ్చి మృతదేహాన్ని పాతమాడుగులకు తరలించారు. యువకుడి తల్లి పెంటమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.