Share News

Pinnelli : అరెస్టు నుంచి.. పిన్నెల్లికి రక్షణ కల్పించొద్దు!

ABN , Publish Date - May 28 , 2024 | 03:29 AM

పోలింగ్‌ రోజున ఈవీఎం, వీవీప్యాట్‌ ధ్వంసం అనంతరం చోటు చేసుకున్న ఘటనలతో పాటు తర్వాతి రోజు కారంపూడిలో సీఐపై దాడి వ్యవహారంలో నమోదైన మూడు కేసుల్లో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే,

Pinnelli : అరెస్టు నుంచి.. పిన్నెల్లికి రక్షణ కల్పించొద్దు!

హైకోర్టుకు ఎమ్మెల్యే బాధితుల తరఫు సీనియర్‌ న్యాయవాది వినతి

ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై నేడు తీర్పు

అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి): పోలింగ్‌ రోజున ఈవీఎం, వీవీప్యాట్‌ ధ్వంసం అనంతరం చోటు చేసుకున్న ఘటనలతో పాటు తర్వాతి రోజు కారంపూడిలో సీఐపై దాడి వ్యవహారంలో నమోదైన మూడు కేసుల్లో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే, అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అరెస్టు నుంచి రక్షణ కల్పించవద్దని ఆయన బాధితులు అభ్యర్థించారు. ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్‌ కేంద్రానికి ఆయన్ను అనుమతించడం శ్రేయస్కరం కాదని.. పోలింగ్‌ నాడు, తర్వాత ఆయన అరాచకం సృష్టించారని వారి తరఫు సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు అన్నారు. ఆయనకు రక్షణ కల్పిస్తే నేర ఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందన్నారు. బెయిల్‌ మంజూరు చేస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని.. ఆయన నేరచరిత్రను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాన్ని వెల్లడించాలని హైకోర్టును కోరారు. ఆ మూడు కేసుల్లో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ పిన్నెల్లి అత్యవసరంగా దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం కోర్టులో విచారణ జరిగింది. బాధితులు నంబూరి శేషగిరిరావు, చెరుకూరి నాగశిరోమణి వ్యాజ్యాల్లో ఇంప్లీడ్‌ అయ్యారు. పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వై.నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే 9కేసుల్లో పిన్నెల్లి నిందితుడిగా ఉన్నారని.. ఈవీఎం ధ్వంసమే కాకుండా తర్వాతి రోజు కూడా అనుచరులతో ర్యాలీ నిర్వహించి ప్రతిపక్షాల వారిని బెదిరించారని తెలిపారు. పోలీసులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారన్నారు.

ఈవీఎం ధ్వంసంలో మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు విధించిన షరతులను ఆయన ఉల్లంఘించారని.. ఆయన కదలికలపై పోలీసులు నిఘా ఉంచలేకపోతున్నారని తెలిపారు. సీఐ నారాయణస్వామిపై దాడి చేసిన కేసులో పిన్నెల్లిని నిందితుడిగా పేర్కొంటూ స్థానిక కోర్టులో మెమో వేశామన్నారు. పిన్నెల్లి తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఆయన పోలింగ్‌ ఏజెంట్లను నియమించుకోవాల్సిన అవసరం ఉందని.. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈవీఎం ధ్వంసం వ్యవహారంలో జూన్‌ 6 వరకు అరెస్టు చేయవద్దని ఇప్పటికే కోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిందని తెలిపారు. ఏవిధంగానైనా అరెస్టు చేసే ఉద్దేశంతో పోలీసులు వరుస ఎఫ్‌ఆర్‌లు నమోదు చేస్తున్నారని..ప్రస్తుత కేసుల్లో కూడా మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటామన్నారు. అన్ని పక్షాల వాదనలు ముగియడంతో న్యాయస్థానం తీర్పు రిజర్వ్‌ చేసింది. మంగళవారం నిర్ణయాన్ని వెల్లడిస్తామని న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రకటించారు.

నేర సామ్రాజ్యంపై బుక్‌లెట్‌

2 లక్షల నుంచి రూ.2 వేల కోట్లకు పిన్నెల్లి ఎలా ఎదిగారో తెలిపిన రచయిత

నరసరావుపేట, మే 27: మాచర్ల నియోజకర్గంలోని పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీప్యాట్లను ధ్వంసం చేసిన అరాచకం దేశవాప్తంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనతో పిన్నెల్లిపై గతంలో ఉన్న నేరాలు, అక్రమ సంపాదన, అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన నేర సామాజ్యంపై ఒక బుక్‌లెట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిని ఎవరు రాశారో గోప్యంగా ఉంచారు. ఈ బుక్‌లెట్‌లో మాచర్లలో జరిగిన హత్యలు.. అన్ని వర్గాలపై దాడులను పేర్కొన్నారు. రూ.2 లక్షల నుంచి రూ.2 వేల కోట్లకు ఎలా ఎదిగారు? గ్రానైట్‌, గ్రావెల్‌ దోపిడీ, పీఆర్‌కే ట్యాక్స్‌, మద్యం అక్రమ వ్యాపారం, భూ కబ్జాలు, అక్రమార్జన వంటి వివరాలను వెల్లడించారు. తోట చంద్రయ్య, కంచర్ల జల్లయ్య యాదవ్‌, బత్తుల సుబ్బులు, ఖాదర్‌ బాషా, అరెద్దుల కోటయ్య యాదవ్‌, బయలమడుగు పిచ్చయ్య హత్యాకాండలను పేర్కొన్నారు. అదేమని ప్రశ్నించిన అనేక మందిపై పిన్నెల్లి గ్యాంగ్‌ దాడులకు తెగబడిన వైనాన్ని కళ్లకు కట్టారు.

Updated Date - May 28 , 2024 | 03:29 AM