రూ.2కోట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణపై విచారణ
ABN , Publish Date - Jul 21 , 2024 | 12:40 AM
మండలంలోని బెల్లంకొండవారిపాలెం సమీపంలో ప్రభుత్వ భూముల ఆక్రమణపై రెవెన్యూ అధికారులు శనివారం విచారణ చేపట్టారు.
70 సెంట్లు అన్యాక్రాంతమైనట్లు గుర్తింపు
కలెక్టర్కు తహసీల్దార్ నివేదిక
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
తాళ్లూరు, జూలై 20: మండలంలోని బెల్లంకొండవారిపాలెం సమీపంలో ప్రభుత్వ భూముల ఆక్రమణపై రెవెన్యూ అధికారులు శనివారం విచారణ చేపట్టారు. ‘రూ.2 కోట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణ’ శీర్షికన ఈనెల 20న ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా విచారణకు ఆదేశించారు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. తూర్పుగంగవరం-దర్శి వెళ్లే ఆర్అండ్బీ రోడ్డులో బెల్లంకొండవారిపాలెం సమీపాన గల సర్వే నంబర్ 85లోని రెండు ఎకరాల ఆర్అండ్బీ భూమిలో 50 సెంట్లు ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఆర్డబ్ల్యూఎస్ శాఖకు చెందిన సర్వే నంబర్ 64/4లో 0.20 సెంట్ల స్థలం ఆక్రమించినట్లు గుర్తించారు. రెండు శాఖలకు చెందిన మొత్తం 0.70 సెంట్ల భూమి అన్యాక్రాంతమైనట్లు తేల్చారు. ఈమేరకు నివేదికను తహసీల్దార్ షేక్ మహమ్మద్ హుస్సేన్ జిల్లా కలెక్టర్కు, సంబంధిత అధికారులకు అందజేశారు.