ఇంటర్ ఫలితాల్లో వెనుకంజ
ABN , Publish Date - Apr 13 , 2024 | 01:03 AM
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలి తాల్లో జిల్లా విద్యార్థులు వెనుకంజ వేశా రు. రాష్ట్ర సగటు కంటే సుమారు 8శాతం తక్కువ ఉత్తీర్ణత సాధించారు.
ద్వితీయ సంవత్సరంలో రాష్ట్రంలోనే జిల్లా 15వ స్థానం
ప్రథమ సంవత్సరం 18వ స్థానానికి పరిమితం
రాష్ట్ర సగటు కంటే 8 శాతం తక్కువ ఉత్తీర్ణత
ఒక కళాశాలలో జీరో ఉత్తీర్ణత
ఒంగోలు (విద్య), ఏప్రిల్ 12 : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలి తాల్లో జిల్లా విద్యార్థులు వెనుకంజ వేశా రు. రాష్ట్ర సగటు కంటే సుమారు 8శాతం తక్కువ ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రాష్ట్రంలో 15వ స్థానంలో నిలువగా, ప్రథమ సంవత్సరం విద్యార్థులు 18వ స్థానానికి పరిమితమయ్యారు. జిల్లాలో ఇంటర్మీడియేట్ పరీక్షల ఫలితాలను శుక్రవారం ఆర్ఐవో ఎ.సైమన్ విక్టర్ పత్రికలకు విడుదల చేశారు. గిద్దలూరు ఎస్వీ జూనియర్ కళాశాలలో జీరో ఉత్తీర్ణత సాధించారు.
ద్వితీయ సంవత్సరం..
జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 17,239 మంది పరీక్షకు హాజరు కాగా 12,366 మంది (71.7శాతం) పాసయ్యారు. రాష్ట్రంలో 15వస్థానంలో నిలిచారు. గత ఏడాది 63.86 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 7వ స్థానంలో నిలవగా ఈ ఏడాది వెనుకబడిపోయారు. రాష్ట్రంలో సగటు ఉత్తీర్ణత 78 కాగా జిల్లా విద్యార్థులు 9.3 శాతం తక్కువ ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల జనరల్ విద్యార్థులు కేవలం 53.5 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 1,429కి 765మంది మాత్రమే పాసయ్యారు. ఒకేషనల్లో 367 మంది పాసై 70.8శాతం ఉత్తీర్ణులయ్యారు, ఏపీ మోడల్ స్కూళ్లలో 380 మందికి 275 మంది పాసై 72.4శాతం ఉత్తీర్ణత సాధించారు. హైస్కూలు ప్లస్ బాలికల జూనియర్ కళాశాలల్లో 814 మందికి 21 మంది (2.6శాతం) మాత్రమే పాసయ్యారు. కేజీబీవీల్లో 390 మందికి206 మంది (52.8 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 466 మందికి 277 మంది (59.4శాతం) పాసయ్యారు. ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో గిద్దలూరు ఎస్వి జూనియర్ కళాశాల నుంచి ఇద్దరు విద్యార్థులు హాజరు కాగా ఇద్దరు ఫెయిలయ్యారు. ఏపీ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాలల్లో 574 మందికి 89.4 శాతం పాసయయ్యారు.
ప్రథమ సంవత్సరం
ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు మొత్తం 20,278 మంది పరీక్షకు హాజరు కాగా 11,900 మంది (58.7శాతం) పాసయ్యారు. రాష్ట్రంలో 18వ స్థానానికి పరిమితమయ్యారు. రాష్ట్రంలో సగటున 67శాతం ఉత్తీర్ణత సాధించగా జిల్లాలో 8.3శాతం తక్కువగా 58.7 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది 48.8శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 10వస్థానంలో నిలవగా ప్రస్తుతం పదిశాతం అదనంగా ఉత్తీర్ణులైనా 18వ స్థానానికి పరిమితమయ్యారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2,119 మందికి 807మంది ఉత్తీర్ణులయ్యారు. ఏపీ మోడల్ స్కూళ్లలో 411 మందికి 25.5శాతం మంది పాసయ్యారు. హైస్కూలు ప్లస్లో 145 మందికి 38మంది ఉత్తీర్ణులయ్యారు. ఏపీ సాంఘిక, గిరిజన సంక్షేమ కళాశాలలో 609 మందికి 503 మంది పాసయ్యారు. కేజీబీవీల్లో 506 మందికి 229 మంది ఉత్తీర్ణులయ్యారు.ఒంగోలు ఏబీఎం ఎయిడెడ్ కళాశాలలో 44మందికి 15మంది పాసయ్యారు.