వైసీపీకి షాక్!
ABN , Publish Date - Apr 30 , 2024 | 01:04 AM
కొత్తపట్నం మండలంలో వైసీపీకి భారీషాక్ తగలనుంది. కొత్తపట్నం, పాదర్తి మాజీ సర్పంచ్లు మూగ ధనమ్మ, మూగ వెంకటేశ్వర్లు ఆ పార్టీని వీడనున్నారు.
పార్టీని వీడనున్న కొత్తపట్నం, పాదర్తి మాజీ సర్పంచ్లు
ఇద్దరూ భార్యాభర్తలు
బాలినేని వైఖరితోనే అని స్పష్టం
టీడీపీలో చేరికకు రంగం సిద్ధం
కొత్తపట్నం (ఒంగోలు నగరం) ఏప్రిల్ 29 : కొత్తపట్నం మండలంలో వైసీపీకి భారీషాక్ తగలనుంది. కొత్తపట్నం, పాదర్తి మాజీ సర్పంచ్లు మూగ ధనమ్మ, మూగ వెంకటేశ్వర్లు ఆ పార్టీని వీడనున్నారు. వారు టీడీపీలో చేరికకు రంగం సిద్ధమైంది. రెండుమూడు రోజుల్లో సైకిలెక్కనున్నారు. ధనమ్మ, వెంకటేశ్వర్లు భార్యాభర్తలు. బీసీ వర్గానికి చెందిన వీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైసీపీ ఆవిర్భావం అనంతరం ఆపార్టీలో చేరారు. చాలాకాలంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి ముఖ్యఅనుచరులుగా కొనసాగిన వారు తాజాగా పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ధనమ్మ, వెంకటేశ్వర్లు దంపతులకు కొంతకాలం నుంచి మండలంలోని ఒకరిద్దరు వైసీపీ నాయకులతో తీవ్రస్థాయిలో విభేదాలున్నాయి. వీటిని బాలినేని దృష్టికి తీసుకెళ్లినా ఆయన తన సామాజిక వర్గం వారినే సమర్థిస్తూ వెనుకబడిన వర్గానికి చెందిన తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వెంకటేశ్వర్లు దంపతులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒంగోలులోని బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకుడు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్తో మాట్లాడి వెంకటేశ్వర్లు దంపతులు పార్టీలో చేరేందుకు లైన్క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో వీరు టీడీపీలో చేరే అవకాశం ఉంది. దీనిపై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీసీ వర్గానికి చెందిన తమను బాలినేని పట్టించుకోవడం లేదని, ఆయన సామాజికవర్గం వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. దీంతో వైసీపీలో ఇమడలేక టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కొత్తపట్నం, పాదర్తి గ్రామాల్లో బీసీ వర్గాల్లో పట్టున్న ఇద్దరు మాజీ సర్పంచ్లు ఎన్నికల సమయంలో పార్టీని వీడటం వైసీపీకి ఇబ్బందికరం కానుంది.