నమ్ముకున్న వారిపైనే నిఘా
ABN , Publish Date - Apr 22 , 2024 | 01:55 AM
ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల జోరు కొనసాగుతోంది. దీంతో అధికార పార్టీ నేతలు అంతర్మథనంలో పడ్డారు.
టీడీపీలోకి వరుస చేరికలతో వైసీపీలో అంతర్మథనం
డివిజన్లలో నేతల పనితీరుపై ఇన్చార్జిల నియామకం
వారితో రోజువారీ నివేదికలు
ఒంగోలులో పార్టీ కార్పొరేటర్లతో ముఖ్యనేత సమావేశం
కొత్తవారిని తేలేరు.. ఉన్నవారిని ఆపలేరంటూ అసహనం
మేయర్ డివిజన్పై రెడ్డి సామాజికవర్గానికి పెత్తనం
నియోజకవర్గంలోని ఇతర చోట్లా ఇదే పరిస్థితి
ఒంగోలు (కార్పొరేషన్), ఏప్రిల్ 21 : ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల జోరు కొనసాగుతోంది. దీంతో అధికార పార్టీ నేతలు అంతర్మథనంలో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి బలంగా ఉంటారనుకున్న పలు వురు వైసీపీలో ఉండలేమంటూ తెగేసిచెప్తున్నారు. వివిధ కారణాలు చెప్పి టీడీపీలోకి క్యూకడు తున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు వైసీపీ ముఖ్యనేతలు సొంత పార్టీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఇతర ముఖ్యుల కదలికలపై నిఘా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆయా డివిజన్లు, మండల, గ్రామ స్థాయిలో ఇప్పటి వరకు పెత్తనం చేసిన వారిపైనే ఇన్చార్జిలుగా కొంతమందిని నియమించినట్లు తెలిసింది. నగర మేయర్ గంగాడ సుజాత ప్రాతినిథ్యం వహిస్తు న్న చెరువుకొమ్ముపాలెం, వెంగముక్కలపాలెంలో డివిజన్ ఇన్చార్జి బాధ్యతలను కృష్ణారెడ్డి, అంజి రెడ్డిలకు అప్పగించారు. దీంతో కొద్దిరోజులుగా మేయర్ డివిజన్కు దూరమయ్యారు.
వలసలను ఆపలేరు... కొత్తవారిని తేలేరు
ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీ బలం రోజురోజుకూ మరింత పెరుగుతోంది. వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరేవారితో అధికార పార్టీకి భారీ షాక్లు తగులుతున్నాయి. దీంతో వైసీపీ శ్రేణులు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ఈనేపథ్యంలో ఈనెల 17న వైసీపీ ముఖ్యనేత ఆపార్టీ కార్పొరేటర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కార్పొరేషన్ ఎన్నికల సమయంలో మీ గెలుపు కోసం ప్రతిపక్షాల వారిని సైతం పలుకరించి వ రీ కలుపుకుపోయారు. సార్వత్రిక ఎన్నికల్లో మా త్రం దూరంగా ఉంటూ ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు?’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళుతున్న వారిని ఎందుకు ఆపలేకపోతున్నారు? టీడీపీ నుంచి వైసీపీలోకి కొత్తగా నాయకులను ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగాలంటే అసలు అక్కడ ఏస్థాయి లో అభివృద్ధి పనులు జరిగాయో కూడా తెలియ ని పరిస్థితి ఉందని ఆయన అన్నట్లు తెలిసింది.
డివిజన్లపై ఇన్చార్జిలకు పెత్తనం
ఎన్నికల్లో ఓటమి భయం వైసీపీని వెంటా డుతోంది. దీంతో గెలుపు కోసం ఆపార్టీ నాయకు లు నానాఅగచాట్లు పడుతున్నారు. కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులపై అదనంగా ఇన్చార్జిలను నియమించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇన్చార్జిలు ప్రతిరోజూ డివిజన్లలో పర్యటించి కార్పొరేటర్, డివిజన్ అధ్యక్షుడి పనితీరుతోపాటు, లోటుపాట్లు, గెలుపు అవకాశాల గురించి నివేదిక అందించాల్సి ఉంది. ఈప్రక్రియ వారం రోజులుగా ఊపందుకొంది. పలు డివిజన్లలో అధికార పార్టీ కార్పొరేటర్లు, నేతల పనితీరుపై ప్రజల్లో విమర్శలు ఉన్నాయని ఇన్చార్జిలు నివేదికలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో డివిజన్ల వారీ ఎదురవుతున్న సమస్యలు, ఇతరత్రా అంశాలపై ముఖ్యనేతలు సీరియస్గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మేయర్ గంగాడ సుజాతను ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న 18వ డివిజన్కు దూరంగా ఉంచినట్లు సమాచారం. నమ్ముకున్న పార్టీ శ్రేణులపైనే నిఘా పెంచి అనుమానించడంపై కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.